టోక్యో: టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులపై కఠినమైన నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. స్టేడియంలో మద్యపానం, కరచాలనాలు, కేరింతలు, ఆటోగ్రాఫ్లను నిషేధించారు. నిపుణులు సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టోక్యో ఒలింపిక్స్ అధ్యక్షురాలు సీకో హషిమోటో వెల్లడించారు. కరోనా మహమ్మారితో ప్రపంచం వణుకుతున్న సమయంలో ఒలింపిక్స్ వేదికల్లోకి ప్రేక్షకులను అనుమతించాలనే నిర్వాహకుల నిర్ణయాన్ని కూడా ఆయన సమర్థించారు.
ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఇటువలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 2020 ఫుట్బాల్ యూరో కప్ మాదిరిగా పండుగ వాతావరణం ఉంటుందని ఊహించుకోవద్దని ఒలింపిక్స్ అధ్యక్షురాలు సీకో హషిమోటో అభిమానులకు స్పష్టం చేశారు. 'ఐరోపాలో వేదికలన్నీ సంబరాలతో నిండిపోయాయి. దురదృష్టవశాత్తు మేం అలా చేయలేకపోవచ్చు' అని హషిమొటొ తెలిపింది.
WTC Final 2021: ఎన్నో ఏళ్ల కల.. ఇప్పుడు తీరే! ఆనందంలో న్యూజిలాండ్!!
స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల ఉష్ణోగ్రత చూడటం తప్పనిసరి. మాస్కులు ధరించాలి. స్టేడియంలో మరో ప్రేక్షకుడిని కలవకూడదు. నిర్దేశించిన సీటులోనే కూర్చోవాలి. కేరింతలు కొట్టకూడదు. పోటీల తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలి. క్రీడాకారుల్ని ఆటోగ్రాఫ్లు అడగడం, మద్దతు తెలపడం, మద్యపానం నిషేధం. ప్రేక్షకులు తమ ఆనందాన్ని బహిరంగంగా వ్యక్తం చేయొద్దని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సూచించారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి.
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భాగంగా భారత్ అధికారిక ఒలింపిక్ థీమ్ సాంగ్ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'లక్ష్య తేరా సామ్నే హై' అంటూ సాగే ఈ పాటను మోహిత్ చౌహాన్ స్వరపరిచారు. ఈ కార్యక్రమాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, సెక్రటరీ జనరల్, స్పోర్ట్స్ సెక్రెటరీ, డిప్యూటీ చెఫ్ డి మిషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీ హాజరయ్యారు. భారత్ నుంచి 100కి పైగా అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు.