టోక్యో: భారత ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో శుభారంభం చేసింది. టోక్యో ఒలింపిక్స్ 2021 రౌండ్ ఆఫ్ 32లో భూటాన్కు చెందిన కర్మపై 6-0తో సునాయాసంగా గెలిచింది. మూడు సెట్లలోనూ దీపికా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీపికా కుమారి మూడు రౌండ్లలో 26, 26, 27 స్కోరు చేయగా.. కర్మ 23, 23, 24 స్కోరు మాత్రమే చేయగలిగింది. మూడు సెట్లలో మొత్తం ఆరు పాయింట్లు గెలిచి.. దీపికా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. మరి కాసేపట్లో దీపికా తన తర్వాతి రౌండ్ ఆడనుంది.
అంతకుముందు ఒలింపిక్స్ 2020లో ఇండియన్ ఆర్చర్ ప్రవీణ్ జాదవ్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ టూపై గెలిచి సంచలనం సృష్టించిన జాదవ్.. రెండో రౌండ్లో అమెరికా ఆర్చర్ ఎలిసన్ బ్రాడీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మూడు సెట్లలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బ్రాడీ.. 6-0తో సునాయాసంగా గెలిచాడు. ప్రవీణ్ తొలి సెట్లో 27, రెండో సెట్లో 26, మూడో సెట్లో 23 స్కోరు చేశాడు. దీంతో వ్యక్తిగత విభాగంలో ఇతడి ప్రయాణం ముగిసింది.
ఇక ఆర్చరీ మెన్స్ సింగిల్స్లో వెటరన్ ప్లేయర్ తరుణ్దీప్ రాయ్ పోరాటం కూడా ముగిసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 32లో గెలిచి పతకం ఆశలు రేపిన రాయ్.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేతను తేల్చిన ఈ రౌండ్లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ ఆర్చర్ ఇతాయ్ షానీ చేతిలో తరుణ్దీప్ రాయ్ పరాజయం పాలయ్యాడు. ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ పోరు రెండు రోజుల క్రితమే ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 2-6 తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓటమిపాలైంది. భారత జోడీ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ పూర్తిగా నిరాశపరిచారు.