
మంచి బైక్ రైడర్
మనకు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్గా మాత్రమే తెలిసిన నీరజ్ చోప్రాలో ప్రపంచానికి తెలియని మరో కోణం కూడా ఉంది. నీరజ్ మంచి బైక్ రైడర్ కూడా అట. నీరజ్ చోప్రాకు చిన్నప్పటినుంచి బైక్లంటే చాలా ఇష్టమట. సమయం దొరికినప్పుడల్లా బైక్పై చక్కర్లు కొడుతుంటాడట. ఈ క్రమంలోనే నీరజ్ మంచి బైక్ రైడర్గా మారాడట. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఫొటోలను పరిశీలిస్తే.. అతనికి బైక్లంటే ఎంత ఇష్టమో ఇట్టే తెలిసిపోతుంది. నీరజ్ పోస్ట్ చేసిన ఫోటోలలో పలు రకాల బైక్స్ ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్థాయిలో కాకపోయినా.. నీరజ్ చోప్రాకు మంచి గ్యారేజ్ ఉందట.

అత్యంత ఖరీదైనది హార్లీ డేవిడ్సన్
పల్సర్ 220ఎఫ్ బైక్ని ఇష్టపడని బైకర్ ఉండడు. నీరజ్ చోప్రాకి కూడా ఈ బైక్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే దీన్ని తన గ్యారేజీలోకి తెచ్చేసుకున్నాడు. చోప్రా దగ్గర ఉన్న బైక్లలో హార్లీ డేవిడ్సన్ 1200 రోడ్స్టర్ అత్యంత ఖరీదైనది. దీన్ని 2019 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన తర్వాత అతడు కొనుగోలు చేశాడు. అదే సంవత్సరం ఓ ట్రాక్టర్ని కూడా కొన్నాడు.
ఈ రెండు ప్రస్తుతం నీరాజ్ స్వస్థలమైన హరియాణాలోని ఖాండ్రాలోని నివాసంలో ఉన్నాయి. మరి ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం సాధించిన నీరాజ్..ఈ సారి ఏ బైక్ కొంటాడో చూడాలి. అయితే నీరాజ్ గ్యారేజీలోకి త్వరలో మహీంద్రా ఎక్స్యూవీ 700 చేరనుంది. ఒలింపిక్స్ 2020లో బంగారు పతకం సాధించినందుకుగాను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ వాహనాన్ని అతడికి బహుమతిగా ప్రకటించారు.

త్వరలోనే ఎక్స్యూవీ 700
నీరజ్ చోప్రా స్వర్ణం గెలవగానే.. అతడిని 'బాహుబలి' అంటూ ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. నీరజ్ జావెలిన్ని విసిరే ఫోటోతో పాటు బాహుబలి చిత్రంలో సైన్యం ముందు బల్లెం పట్టుకుని గుర్రం మీద కూర్చున్న ప్రభాస్ ఫోటోని షేర్ చేశారు. అయితే రితేష్ జైన్ అనే ట్విటర్ యూజర్ నీరజ్ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న ఎస్యూవీ శ్రేణికి చెందిన ఎక్స్యూవీ 700ని ఇవ్వాలిసిందిగా కోరాడు.
రితేష్ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్ మహీంద్ర.. 'తప్పకుండా ఇస్తాను. స్వర్ణం సాధించిన మా అథ్లెట్కు ఎక్స్యూవీ 700 బహుమతిగా ఇవ్వడం నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం. అంతేకాక గౌరవం కూడా' అని రిప్లై ఇచ్చారు.
క్రీడలకు స్థానం లేదు
నీరజ్ చోప్రా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... తన ప్లానింగ్లో ఏనాడూ క్రీడలకు స్థానం లేదని, దేశం కోసం ఆడి బంగారు పతకం సాధిస్తానని అస్సలు ఊహించలేదన్నాడు. స్టేడియానికి వెళ్లడం, అక్కడ స్నేహితులు జావెలిన్ విసురుతుంటే చూసి తాను విసరడం అంతా అనుకోకుండా జరిగిందని గుర్తుచేసుకున్నారు.
తన కుటుంబంలోగానీ, గ్రామంలోగానీ గుర్తింపు పొందిన క్రీడాకారులు ఎవరూ లేరని.. అయినా అనుకోకుండా తాను జావెలిన్ త్రో పై మక్కువ పెంచుకుని సాధన చేశానని నీరజ్ తెలిపాడు. ముందుగా ఆటల్లోకి రావాలన్న ఆసక్తి లేకపోయినా.. జావెలిన్ త్రో పై ఇష్టం ఏర్పడిన తర్వాత చాలా హార్డ్వర్క్ చేశానన్నాడు. అందరి సహకరాంతోనే తనకు ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించే ఘనత దక్కిందని నీరజ్ పేర్కొన్నాడు.
13 ఏళ్ల తర్వాత
టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించారు. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంతో జాతీయ గీతాన్ని మరోసారి వినిపించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శనివారం జరిగిన ఫైనల్లో.. తొలి అవకాశంలోనే ఈటెను 87.03 మీటర్లు విసిరి నీరజ్ చోప్రా అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత మెరుగుపరుచుకొని.. 87.58 మీటర్లు విసిరి పతకం పోటీలో ముందుకెళ్లాడు.
ఆరు రౌండ్లు ముగిసే సమయానికి పోటీలో పాల్గొన్న అథ్లెట్లలో అత్యధిక దూరం (87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడాడు. రెండో స్థానంలో నిలిచిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వడ్లెక్ గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్ను విసిరారు. చెక్ రిపబ్లిక్కు చెందిన విటెజ్స్లావ్ వెస్లీ గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.


Click it and Unblock the Notifications












