
టోక్యో: కరోనా వైరస్ పంజా విసురుతున్నా.. జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ 2020 క్రీడలు కొనసాగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భద్రతా చర్యలు తీసుకుంటూ విశ్వ క్రీడల్ని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటూ టోర్నీని ముందుకు కొనసాగిస్తున్నారు. అథ్లెట్లు, సిబ్బంది, అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్లేయర్స్ ఆడేటప్పుడు తప్ప.. మిగతా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే తాజాగా మెడల్ గెలిచిన వాళ్లకు మాత్రం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
టోక్యో ఒలింపిక్స్ 2021లో మెడల్ గెలిచిన అథ్లెట్లు పోడియంపై నిల్చున్న సమయంలో 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు నిర్వాహకులు. ఆ సమయంలో అథ్లెట్లు ఫొటోలకు పోజులివ్వడానికే ఈ అవకాశం ఇచ్చారు. 30 సెకన్ల పాటే అవకాశం ఇస్తున్నట్లు సోమవారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ వెల్లడించారు. అయితే అథ్లెట్లు ఆ సమయాన్ని దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. పోడియంపై నిల్చున్న సమయంలో నిర్వాహకులు చెప్పినప్పుడు మాత్రమే ఫొటోల కోసం మాస్కులు తీయాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనాలని ప్రతీ క్రీడాకారుడు కోరుకుంటాడు. అందుకోసం ఎంతో కష్టపడతాడు. ఇక విశ్వ క్రీడల్లో పతకం తీసుకుంటే ఆ క్రీడాకారుడు జీవితంలో అది చాలా పెద్ద్ ఎచీవ్ మెంట్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒలింపిక్స్ క్రీడల్లో పోడియం నిలబడి పతకం తీసుకునే క్షణాలు ఎంతో మధురమనవి. అటువంటి మధురమైన అద్భుతమైన క్షణాలు మాస్కుతో కప్పబడి ఉంటే.. కాస్త ఇబ్బంది కలిగించేదనే చెప్పాలి. అందుకే పోడియం మీద నిలబడిన 30 సెకన్లు మాస్కు పెట్టుకోకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు అధికారులు. భారత దేశానికి చెందిన మీరాభాయి ఛాను పతకాన్ని గెలిచేనాటికి ఈ ప్రకటన వెలువడలేదు. అందుకే మీరా పతకం తీసుకునేటప్పుడు మాస్క్ ధరించే ఉంది.
ఒక పక్క ఆటలు సాగుతుండగా మరోపక్క కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా డచ్ టెన్నిస్ ఆటగాడు జీన్ జూలియన్ రోజర్కు కరోనా సోకింది. ఫలితంగా అతడు క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రోజర్ అతడి డబుల్స్ భాగస్వామి వెస్లీ కూలుఫ్ న్యూజిలాండ్ ద్వయం మార్కస్ డానియల్, మైకేల్ వీనస్తో తలపడాల్సి ఉంది. పాజిటివ్ ఫలితం రావడంతో రెండో రౌండ్ మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోమవారం 16 కొత్త కేసులు రావడం గమనార్హం. సోమవారం ముగ్గురు అథ్లెట్లు, నలుగురు కాంట్రాక్టర్లు, ఎనిమిది మంది సహాయ సిబ్బంది, ఒక ఉద్యోగికి పాజిటివ్ వచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారు.