
ముంబై: టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలతో పాటు, రివార్డుల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ 2020లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శనివారం సాయంత్రం నగదు నజరానా ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒలింపిక్స్లో భారత్ తరఫున ఏకైక స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు బహుమతిగా ప్రకటించారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో 100 ఏళ్ల తర్వాత భారత్కు తొలి స్వర్ణం దక్కిన విషయం తెలిసిందే.
ఇక ఒలింపిక్స్ 2020లో రజతం సాధించిన మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), రవి కుమార్ దాహియా (రెజ్లింగ్)కు చెరో అర కోటి ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. అలాగే కాంస్య పతకాలు సాధించిన బజరంగ్ పూనియా (రెజ్లింగ్), లవ్లీనా బార్గోహేన్ (బాక్సింగ్), పీవీ సింధు (బాడ్మింటన్)కు తలా రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల నగదు నజరానాను బీసీసీఐ ప్రకటించింది.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.2 కోట్ల రివార్డును పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇప్పటికే హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఆ రాష్ట్ర సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతో పాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇక నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంపై ఆయన సోంతూరులో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా సంబరాలు జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలను ఊపుతూ, డప్పులు వాయిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు.
తాజాగా బడ్జెట్ కారియర్ ఇండిగో ఎయిర్లైన్స్ కూడా నీరజ్ చోప్రాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. విశ్వ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ప్రయాణ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించింది. మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్లో పసిడి పతకాన్ని సాధించినందుకు గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వనున్నట్లు ఇండిగో తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు ఏడో తేదీ వరకు అపరిమితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది.
'నీరజ్.. మీరు సాధించిన విజయం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. మీరు దేశానికి గర్వకారణం. మా విమానాల్లో మీరు ప్రయాణించడానికి స్వాగతం పలుకుతున్నాం. మీకు ఏడాది పాటు ఉచితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఇస్తామని తెలియజేస్తున్నాం. కష్టపడితే విజయం సాధించొచ్చునని మీరు రుజువు చేశారు. భవిష్యత్ భారత అథ్లెట్లకు మీరే టార్చ్ బేర్గా ఉంటారు. వెల్డన్' అని ఇండిగో సీఈవో కం హోల్టైం డైరెక్టర్ రొనోజోయ్ దత్తా తెలిపారు.