|
ఓడినా రజతం ఖాయం..
సెమీ ఫైనల్లో ఆమె ఓడినప్పటికీ.. రజత పతకాన్ని అందుకుంటారు. విజయాన్ని గనక సాధించగలిగితే రజతానికి, ఓటమి లేకుంటే స్వర్ణాన్ని సాధించగలరు లవ్లీనా. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం.. నాలుగు కేటగిరీల్లో సెమీ ఫైనల్స్కు చేరిన ప్రతి బాక్సర్ కూడా పతకానికి అర్హులే. క్వార్టర్ ఫైనల్స్ టై కావడమో లేదా.. మూడో స్థానంలో నిలవడమో జరిగితే తప్ప.. మెడల్ అందుకోలేరు బాక్సర్లు. క్వార్టర్ఫైనల్స్లో లవ్లీనా బొర్గోహెయిన్ అద్భుతంగా సత్తా చాటారు. ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపడ్డారు. ఈ గేమ్లో ఆమె విజేతగా ఆవిర్భవించారు. సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. దీనితో ఆమెకు పతకం ఖాయమైంది.
|
గోల్డ్ మెడలిస్ట్పై పూర్తి ఆధిపత్యం..
కొకుగికన్ బాక్సింగ్ ఎరీనాలో మొత్తం మూడు రౌండ్లుగా సాగిన ఈ బౌట్లో లవ్లీనా బొర్గోహెయిన్ మొదటి నుంచీ ఆధిపత్యాన్ని కనపరిచారు. 2018 ప్రపంచ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, 2019 ఆసియన్ ఛాంపియన్షిప్ రజత పతక విజేత చైనీస్ తైపేకు చెందిన చిన్-చెన్ నియాన్పై భారీ పంచ్లతో విరుచుకుపడ్డారు. బాక్సింగ్ రింగ్లో అపారమైన అనుభవం ఉన్నప్పటికీ.. లవ్లీనా పంచ్ల నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు. మూడు రౌండ్లలోనూ ఆమె తన ఆధిపత్యాన్నిచేజార్చుకోలేదు. నియాన్ విసిరే పంచ్ల నుంచి మెరుపు వేగంతో తప్పించుకుంటూనే ముష్టిఘాతాలతో చెలరేగిపోయారు.
|
మూడో బాక్సర్గా..
ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన భారత మూడో బాక్సర్ లవ్లీనా. ఇదివరకు ఒలింపిక్స్ బాక్సింగ్ కేటగిరీలో మేరీ కోమ్, విజేందర్ సింగ్ మాత్రమే పతకాన్ని సాధించారు. ఇప్పుడీ జాబితాలో లవ్లీనా చేరారు. అస్సాంకు చెందిన 23 సంవత్సరాల లవ్లీనాకు ఇదే తొలి ఒలింపిక్స్. కొత్తే అయినప్పటికీ.. ఎక్కడా తడబాటును ప్రదర్శించలేదు. సరైన సమయంలో కౌంటర్ అటాక్ చేశారు. ప్రత్యర్థిని కదలనివ్వలేదు. చైనీస్ తైపే ప్రత్యర్థి బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దూకుడు, ఎదురు దాడే మంత్రంగా రజత పతకాన్ని ముద్దాడబోతోన్నారు. 4-1తో ప్రత్యర్థిని మట్టికరిపించారంటే ఆమె ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు.
లవ్లీనాపై ప్రశంసలు
లవ్లీనా బొర్గొహెయిన్ సాధించిన ఈ ఘనత పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. పలువురు కేంద్రమంత్రులు ఆమెను అభినందిస్తూ ట్వీట్లను పోస్ట్ చేస్తోన్నారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారంటూ ప్రశంసలు కురిపిస్తోన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు దక్కిన రెండో పతకం ఇది. ఇదివరకు వెయిట్ లిఫ్టింగ్లో మణిపూర్కు చెందిన మీరాబాయి చాను రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలకే చెందిన అస్సాం యువతి లవ్లీనా.. దేశానికి మరో పతకాన్ని అందించనున్నారు.