ప్రత్యర్థిని నిలువరించలేక..
కొకుగికన్ బాక్సింగ్ ఎరినాలో భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 9:36 నిమిషాలకు ఈ బౌట్ ప్రారంభమైంది. ఎన్నో అంచనాల మధ్య సతీష్ కుమార్..ఉజ్బెక్ వరల్డ్ ఛాంపియన్ బొఖొదిర్ జలొలొవ్తో తలపడ్డారు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ బౌట్ను సతీష్ కుమార్ ఏకపక్షంగా గెలుచుకున్న పరిస్థితుల్లో ఆయన ఫామ్, పెర్ఫార్మెన్స్పై ఎలాంటి అనుమానాలు లేవు.
క్వార్టర్ ఫైనల్స్ గండాన్ని అధిగమిస్తాడనే ఆశించారంతా. రింగ్లో మాత్రం ఆ ఆశలు నెరవేరలేదు. ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలం అయ్యాడు. తన ఎదురుగా ఉన్నది బాక్సింగ్ జెయింట్ కావడం.. తొలిసారిగా ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టడం వంటి ఒత్తిళ్ల మధ్య అంచనాలకు అనుగుణంగా సతీష్ కుమార్ సత్తా చాటలేకపోయారు. ఈ బౌట్ను 0-5తో కోల్పోయారు.
బాక్సింగ్ జెయింట్ చేతిలో
ఈ బౌట్లో ఉజ్బెక్ బాక్సర్ ఎత్తు కీలక పాత్ర పోషించిందనే విశ్లేషణలు ఉన్నాయి. బొఖొదిర్ హైట్ 6.4 అడుగులు. సతీష్ కుమార్ విసిరిన కొన్ని పంచ్ల నుంచి అతను అలవోకగా తప్పించుకోగలగడం ఓటమికి దారి తీశాయి. తన ఎత్తును అడ్వాంటేజ్గా తీసుకుని బొఖొదిర్.. రౌండ్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 2019 నాటి బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్, ఈ ఏడాదే జరిగిన ఆసియన్ ఛాంపియన్ పోటీల్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఆ అనుభవం బొఖొదిర్కు ఇక్కడ అక్కరకు వచ్చింది. మూడు రౌండ్లలోనే బౌట్ను ముగించేశాడతను. ప్రతి బౌట్లోనూ పైచేయి సాధించాడు.
అక్కరకొచ్చిన అనుభవం..
తొలి రౌండ్లో సతీష్ కుమార్ అసాధారణంగా రాణించాడు. సత్తా చాటాడు. బొఖొదివ్ అప్పర్ కట్స్ను అధికంగా ప్రయోగించడాన్ని సమర్థవంతంగా అడ్డుకోలేకపోయాడు. క్వార్టర్ ఫైనల్స్ను సతీష్ కుమార్ గెలిచి ఉంటే.. భారత్కు ఖచ్చితంగా పతకం ఖాయమై ఉండేది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు ఉత్తర ప్రదేశ్ బాక్సర్. పోరాడి.. తలవంచాడు. ఈ ఓటమితో పురుషుల బాక్సింగ్ విభాగం నుంచి భారత్ ప్రాతినిథ్యానికి తెరపడినట్టయింది.
మహిళ కేటగిరీలో రజతం
ఇప్పటికే భారత బాక్సర్లు మనీష్ కౌశిక్ (63 కేజీలు), వికాస్ కృష్ణన్ (69 కేజీలు), ఆశీష్ చౌదరి (75 కేజీలు), అమిత్ ఫంగల్ (51 కేజీలు) ఓడిపోయారు. గ్రూప్ దశలోనే వారి పోరు ముగిసింది. సతీష్ కుమార్ ఒక్కడే క్వార్టర్ ఫైనల్స్లో ఎంట్రీ ఇచ్చాడు. ఒత్తిడిని అధిగమించలేకపోవడంతో పరాజయాన్ని చవి చూశాడు. మహిళల బాక్సింగ్ విభాగంలో మాత్రం భారత్కు రజత పతకం ఖాయమైన విషయం తెలిసిందే. అస్సామీ యువతి లవ్లీనా బొర్గోహెయిన్ సెమీ ఫైనల్లో ప్రవేశించారు. అక్కడ ఆమె ఓడినా రజతం మాత్రం ఖాయం. ప్రస్తుతం స్వర్ణ పతకం కోసం ఆమె శ్రమిస్తోన్నారు.