గౌహతి: ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టోర్నీలో శుభారంభాన్ని అందుకోవడంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్న కేరళ బ్లాక్బస్టర్స్ విఫలం కావడానికి ఆ జట్టు క్రీడాకారుల్లో ఏకాగ్రతత లోపించడమే కారణం. అట్టహాసంగా టోర్నీ ప్రారంభానికి ఆతిథ్యమిచ్చిన నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి జట్టుతో పోలిస్తే కేరళ కుర్రాళ్లు ఏ విభాగంలోనూ పూర్తిస్థాయిలో మ్యాచ్కు సన్నద్ధం కాలేదని అనిపిస్తున్నది.
ఫుట్బాల్ టోర్నీ లీగ్దశలోనే ఆయా జట్ల బలం, బలహీనత, విజయావకాశాలను కొంత మేరకు నిర్ధారించవచ్చునని విశ్లేషకుల అభిప్రాయం. రెండున్నర నెలల పాటు సాగే ఐఎస్ఎల్ టోర్నీలో ముచ్చటగా మూడోసారి కేరళబ్లాక్బస్టర్స్ వచ్చే వారాల్లో తమ ఆటలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించుకోవడం అవసరం.
నార్త్ ఈస్ట్ జట్టు మ్యాచ్లో విజయం కోసం అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేసుకుని రంగంలోకి దిగితే.. కేరళ సెంట్రల్ మిడ్ ఫీల్డర్లుగా ఉన్న మెహ్తబ్ హుస్సేన్, వినీత్ రాయ్, దిదియర్ కాడియో.. ఫీల్డ్లో తమ ముందు ప్రత్యర్థి జట్టు ఫార్వర్డ్ ప్లేయర్స్ తేలిగ్గా దూసుకెళ్లేందుకు అనువైన స్థలాన్ని వదిలేశారు. ఆంటోనియో జర్మన్ మినహా మిగతా మెరుగ్గా ఆడతారని భావించిన కేరళ బ్లాక్బస్టర్ సభ్యులు తమ ఆట తీరును ప్రదర్శించలేకపోయారు.

ప్రత్యర్థి డిఫెన్స్ను ఎదుర్కోవడానికి హలీచరణ్ నార్జరీ ప్రయత్నించినా 19వ నిమిషంలో గోల్ చేయలేకపోయాడు. తొలి మ్యాచ్ మొదటి హాఫ్లో గోల్స్ కోసం రెండు జట్లు తమ వ్యూహం అమలు సమయం కోసం వేచి ఉన్నాయే గానీ తప్ప తెలివిగా వ్యవహరిస్తూ ఫార్వర్డ్ పాయింట్లు సాధించేందుకు సిద్ధపడలేదు.
రెండో హాఫ్లో బ్రేక్ పాయింట్ సాధించేందుకు కెబిబిసి చేసిన యత్నాలన్నీ నార్త్ఈస్ట్ ఆటగాడు కస్తుమి యుసా డిఫెన్స్ ముందు తునాతునకలయ్యాయి. మ్యాచ్ ముగిసే ముందు ఇరువైపులా అలర్ట్గా ఉన్నా కస్తుమి 55వ నిమిషంలో చేసిన గోల్తో నార్త్ ఈస్ట్ 1 - 0 తేడాతో ఆధిక్యత సాధించింది. నార్త్ఈస్ట్ గోల్ చేశాక దాన్ని అధిగమించేందుకు కేరళలో కొత్త ఆటగాళ్లు మిఖైల్ చోప్రా, డకెన్స్ నాజోన్ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. చివరిదశలో సుబ్రతా పాల్ ఆందోళనకు గురైనా.. అశ్రద్ధగా వ్యవహరించడంతో గోల్ సాధించడంలో విఫలమయ్యాడు.
శుభారంభంతో మూడు పాయింట్లు కొట్టేసిన జాన్ అబ్రహం జట్టు వచ్చే ఐదు రోజుల్లో ఆడే మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిసినా నాలుగు పాయింట్లు వస్తాయి. అయినా టోర్నీలో ముందుకు దూసుకెళ్లాలన్నా వారి కలల సాకారానికి శుభారంభం అవుతుంది.
ప్రొఫెసర్గా పేరొందిన నార్త్ఈస్ట్ కోచ్ నెలో వింగాడ తమ జట్టు విజయంపై హర్షం వ్యక్తంచేసినా సభ్యుల ఆటతీరు మరీ అంతగా గొప్పగా ఏమీ లేదని పెదవి విరిచాడు. తన శిష్యులు ఆట తీరు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. టోర్నీలో మరిన్ని మ్యాచ్ల్లో విజయం సాధించాలంటే తొలిమ్యాచ్లో ఎక్కువ పాయింట్లు సాధించాల్సిందని వ్యాఖ్యానించాడు. సెకండ్ హాఫ్లో సరైన సమయంలోనే గోల్ సాధించారని తెలిపాడు.
జట్టు సభ్యుల్లో మందగమనం వల్లే ఓటమి పాలయ్యామని కేరళ బ్లాక్బస్టర్స్ కోచ్ స్టీవ్ కొప్పెల్ అభిప్రాయ పడ్డాడు. తాము చాలా బాగా కష్టపడ్డామని, కానీ లక్ష్య సాధనకు అవకాశాలు సృష్టించబడవని అన్నాడు.
ఆటగాళ్ల వ్యక్తిగత వ్యూహం కూడా ముఖ్యమేనని తెలిపాడు. తొలి మ్యాచ్లో విజయావకాశాలపై సభ్యుల్లో ఆందోళన, ఆసక్తి కూడా ప్రభావితంచేస్తుందన్నాడు. నార్త్ఈస్ట్ ఆటగాళ్లు తెలివిగా వ్యవహరిస్తూ పై చేయి సాధించారని పేర్కొన్నాడు.