ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత విజేతల గురించి మాట్లాడుతూ తన పేరును ప్రస్తావించడం, అభినందించడం ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలిగించిందని భారత స్టార్ మహిళ బాక్సర్ ఎంసి మేరీకోం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తన పేరును గుర్తించడం తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది.
భారత్లో చివరిదైన మూడో రోజు పర్యటన సందర్భంగా సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా మాట్లాడుతూ.. ప్రముఖ భారత క్రీడాకారులను ప్రశంలతో ముంచెత్తారు. ముఖ్యంగా బాక్సర్ మేరీకోం, స్ప్రింటర్ దిగ్గజం మిల్కా సింగ్లను ఒబామా కొనియాడారు.
అగ్రరాజ్య అధినేత నుంచి ఊహించని విధంగా ప్రశంసలు రావడంతో మేరీకోం ఆనందం వ్యక్తం చేసింది. మేరీ కోం ప్రస్తుతం థాయ్లాండ్ బాక్సింగ్ క్రీడకు అంబాసిడర్గా ఉన్నారు. అంతేగాక ఆమె థాయ్లాండ్ పర్యటక శాఖకు ప్రమోటర్గానూ కొనసాగుతున్నారు.

' నా పేరు ప్రస్తావించినందుకు ఆయన(ఒబామా)కు కృతజ్ఞతలు. నా ప్రదర్శనను ఆయన ఏళ్లపాటు గుర్తుంచుకున్నారు. ఆయన ఎవరి పేరునైనా ప్రస్తావించవచ్చు. నా పేరును ప్రస్తావించినందుకు ఎంతో గర్వంగా ఉంది' అని ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన మేరీకోం పేర్కొంది.
తాను ఒబామాకు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందేనని ఆసియన్ గేమ్స్లోనూ బంగారం పతకం సాధించిన మేరీకోం తెలిపింది. తన పేరును ప్రస్తావించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని చెప్పింది. భుజం గాయం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తాను.. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టానని మేరీకోం తెలిపింది. త్వరలోనే జరగనున్న టోర్నీలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేసింది.