
జకార్తా: ఆసియా క్రీడలు 2018లో భారత్ బృందంగా గెలిచిన తొలి పతకమిది. ఆసియా క్రీడల్లో భారత సెపక్ తక్రా జట్టు సంచలనం సృష్టించి కాంస్యాన్ని ఖాయం చేసింది. చరిత్రలో ఇప్పటివరకూ సెపక్ తక్రాలో పతకం దక్కిన దాఖలాలు లేవు. ఆసియా క్రీడల్లోని మూడో రోజున తొలిసారి దేశానికి పతకాన్ని సాధించిన భారత జట్టు చరిత్రను లిఖించింది. సెమీస్ చేరిన జట్లకు గెలుపోటములతో సంబంధం లేకుండా కాంస్య పతకాలు అందజేస్తారు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
'భారత్ది చారిత్రక ప్రదర్శన. ఆసియా క్రీడల్లో తొలిసారి సెపక్ తక్రాలో పతకం గెలిచాం' అని భారత సెపక్ తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేంద్ర సింగ్ దహియా మీడియాకు తెలిపారు. సెపక్ తక్రా అచ్చం వాలీబాల్ తరహాలో ఉంటుంది. బంతిని అవతలి కోర్టులోకి పాస్ చేసేందుకు కాళ్లు, భుజాలు, తల, మోకాళ్లు మాత్రమే ఉపయోగించాలి. చేతులతో ఆడేందుకు అనుమతి లేదు. మహిళల సెపక్ తక్రా జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటంతో క్వార్టర్స్ చేరలేదు.