న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, భారత్ ల ఢిల్లీలో జరిగిన మూడో టెస్టు క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్సులో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి లక్ష్మణ్ 59 పరుగులతో, గంగూలీ 32 పరుగులతో నాటవుట్ గా ఉన్నారు. తొలి ఇన్నింగ్సులో 200 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 59 పరుగులు చేసి నాటవుటుగా మిగిలిన లక్ష్మణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచుగా ఎన్నికయ్యారు. గంభీర్ 36, ద్రావిడ్ 11, సచిన్ టెండూల్కర్ 47 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్కు 577 పరుగుల వద్ద తెరపడిన తర్వాత తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రెట్లీ బౌలింగ్లో ఓపెనర్ సెహ్వాగ్ (16) తక్కువ పరుగులకే క్రీజు నుంచి నిష్క్రమించాడు. సెహ్వాగ్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ (1) సైతం క్లార్క్ బౌలింగ్లో పాంటింగ్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ బాట పట్టాడు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులతో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్కు 577 పరుగుల వద్ద తెరపడింది. దీంతో భారత్కు 36 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. క్లార్క్ (112), పాంటింగ్ (87), హెడెన్ (83), కటిచ్ (64), హస్సీ (53), వైట్ (44)లు రాణించడంతో భారత్కు ధీటుగా ఆస్ట్రేలియా సైతం తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో సెహ్వాగ్ ఐదు, కుంబ్లే మూడు వికెట్లు సాధించగా మిశ్రా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మ్యాచ్లో తన తొలి ఇన్నింగ్స్లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 613 పరుగుల వద్ద డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే. గంభీర్ (206), లక్ష్మణ్ (200)లు డబుల్ సెంచరీ సాధించి భారత్ భారీ స్కోరు సాధించేందుకు సాయపడ్డారు.