తెలుగు స్ప్రింటర్ యర్రాజి జ్యోతి అదరగొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో పసిడి పతకంతో మెరిసింది. గురువారం నాడు ఈ టోర్నీలో మహిళల 100 మీ. హర్డిల్స్ ఫైనల్స్ జరిగాయి. ఈ పోటీలో 23 ఏళ్ల జ్యోతి కేవలం 13.09 సెకన్లలోనే రేస్ను పూర్తి చేసింది. దీంతో ఆమెను గోల్డ్ మెడల్ వరించింది. ఆ తర్వాతి రెండు స్థానాలూ జపాన్ రన్నర్లకే దక్కడం గమనార్హం.
రెండో స్థానంలో 13.13 సెకన్లలో రేస్ ముగించిన టెరాడ అసుక నిలవగా, మూడో స్థానం దక్కించుకున్న అవోకి మాసుమి 13.26 సెకన్లలో పూర్తిచేసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ జ్యోతినే. ఈ విజయంతో ఆమె కొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి.

మరో విశేషం ఏంటంటే.. జ్యోతి సాధారణంగా ఇంత కన్నా వేగంగా పరిగెడుతుంది. ఆమె జాతీయ రికార్డు కేవలం 12.82 సెకన్లే. కానీ వర్షం కారణంగా ఈ పోటీల్లో ట్రాక్ బాగా తడిసిపోయింది. దీంతో అథ్లెట్లు సాధారణంగా పరిగెత్తే అంత వేగంగా పరిగెత్తలేకపోయారు. జ్యోతి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన క్రీడాకారిణి. విశాఖపట్నానికి చెందిన ఒక టాక్సీ డ్రైవర్ కూతురు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అడుగుపెట్టిన ఆమె గొప్ప క్రమశిక్షణ, చిత్తశుద్ధి, పట్టుదలతో సాధన చేసింది.
ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో స్ప్రింటర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా అద్భుతమైన రికార్డులు సాధిస్తోంది. ఇక పురుషుల 1500 మీ. రేసులో అజయ్ కుమార్ సరోజ్, ట్రిపుల్ జంప్లో అబ్దుల్లా అబూబకర్ కూడా పసిడి పతకాలతో మెరిశారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ రెండో రోజైన గురువారం ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో భారత్ మూడు స్వర్ణాలు, రెండు కాంస్యాలు దక్కించుకోవడం విశేషం. మహిళల 400 మీటర్ల ఫైనల్లో ఐశ్వర్య మిశ్రా (53.07 సె.) కాంస్యం సాధించింది.
పురుషుల డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్ (7527 పాయింట్లు) కాంస్య పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. పురుషుల 1500 మీ. రేసులో సరోజ్ 3 నిమిషాల 41.51 సెకన్ల టైమింగ్తో పసిడిని పట్టేశాడు. ఈ రేసులో అతను ప్రత్యర్థుల కంటే వెనుకబడినట్లే కనిపించాడు. కానీ చివర్లో ఒక్కసారిగా ముందుకు వంగి ఫినిషింగ్ లైన్ మీదకు దూసుకెళ్లడంతో అతడిని పసిడి వరించింది. ఇక ట్రిపుల్ జంప్లో అబూబకర్ 16.92 మీటర్ల దూరం దూకి స్వర్ణం నెగ్గాడు.