భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్షిప్ చివరి రోజు తెలుగు అథ్లెట్లు పతకాలతో మెరిశారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అథ్లెట్లు ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. మహిళల లాంగ్ జంప్లో భవానీ యాదవ్ భగవతి అద్భుతంగా రాణించింది. ఆమె ఏకంగా 6.44 మీటర్ల దూరం జంప్ చేసింది. ఈ జంప్తో ఆమె లాంగ్ జంప్లో మూడో స్థానంలో నిలిచి, కాంస్య పతకం ముద్దాడింది.
ఇంతలా రాణించినా కూడా భవానీకి అదృష్టం కలిసిరాలేదు. ఆసియా కప్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు లాంగ్ జంప్ కనీసం 6.45 మీటర్లు చేయాల్సి ఉంది. కానీ భవానీ కేవలం 6.44 మీటర్లు మాత్రమే జంప్ చేసింది. దీంతో ఆమె ఆసియా కప్ బెర్తును త్రుటిలో చేజార్చుకుంది. లాంగ్ జంప్లో కేరళకు చెందిన ఆన్సీ సోజన్ 6.51 మీటర్లు జంప్ చేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది.

అదే పోటీల్ల ఉత్తర ప్రదేశ్కు చెందిన శైలీ సింగ్ 6.49 మీటర్ల లాంగ్ జంప్తో రెండో స్థానం కైవసం చేసుకుంది. ఆమెకు రజత పతకం దక్కింది. ఇక, మరో తెలుగు అథ్లెట్ రష్మిక కూడా కాంస్య పతకంతో మెరిసింది. జావెలిన్ త్రోలో పోటీ పడిన ఆమె.. ఏకంగా 50.95 మీటర్ల దూరం జావెలిన్ను విసిరింది. ఈ పోటీల్లో యూపీకి చెందిన అన్నూరాణి స్వర్ణ పతకం సాధించింది.
హరియాణాకు చెందిన మరో జావెలిన్ త్రోయర్ ప్రియాంక రెండో స్థానంలో నిలిచి, రజతం దక్కించుకుంది. కాగా, పురుషు షాట్ పుట్లో పంజాబ్కు చెందిన తజీందర్ పాల్ అద్భుతంగా రాణించాడు. అతను షాట్ పుట్ బాల్ను ఏకంగా 21.77 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో ఆసియాలో తన రికార్డును తనే బద్దలుకొట్టాడు. గతంలో అతను 21.49 మీటర్లు షాట్ బాల్ను విసిరాడు. ఈ క్రీడల్లో తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజీ ఉత్తమ మహిళా అథ్లెట్గా అవార్డు దక్కించుకోవడం గమనార్హం.