ఆర్చరీ వరల్డ్ కప్లో తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం అదరగొట్టింది. ఈ టోర్నమెంట్లో తొలి స్వర్ణ పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఆమె అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. గతంలో అంటే 2021 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా ఆమె ఫైనల్ చేరింది. కానీ ఆ మ్యాచ్లో లెజెండరీ ఆర్చర్ సారా లోపెజ్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ పరాజయానికి కూడా ఆమె ప్రతీకారం తీర్చుకుంది.
టర్కీ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో సారాను 149-146 తేడాతో ఓడించింది. దీంతో ఈ టోర్నీలో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్ కప్లో జ్యోతికి ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం గమనార్హం. అంతకుముందే తన పార్టనర్, అరంగేట్ర ఆటగాడు ఓజాస్ డియోటేల్తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కూడా ఆమె స్వర్ణం సాధించింది.

ఈ విభాగంలో చైనీస్ తైపీ జోడీతో తలపడిన జ్యోతి, ఓజాస్ జోడీ 159-154 తేడాతో గోల్డ్ మెడల్ కొట్టింది. ఈ పోటీలో జ్యోతి, ఓజాస్ జోడీ వేసిన 16 యారోస్లో 15 సార్లు టార్గెట్ను సెంటర్లో కొట్టిన వీళ్లు.. 150 పాయింట్లు సాధించారు. అయితే ఒక్కసారి మాత్రమే తడబడ్డారు. దీంతో ఈ జోడీకి 159 పాయింట్లు వచ్చాయి. లేదంటే ఫుల్ పాయింట్లతో రికార్డు సృష్టించేదే. వరల్డ్ కప్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్కు స్వర్ణం రావడం ఇది రెండోసారి.
గతంలో జ్యోతి, వెటరన్ అభిషేక్ వర్మ కూడా ఈ పతకం సాధించారు. 2022లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్లో ఈ జోడీ స్వర్ణం సంపాదించింది. అయితే ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగిన ట్రయల్స్ను క్లియర్ చేయడంలో అభిషేక్ విఫలం అయ్యాడు. దీంతో ఈ ఏడాది వరల్డ్ కప్లో భారత బృందంలో అనుభవం లేదని కొందరు ఆందోళన చెందారు. కానీ జ్యోతి, ఓజాస్ జోడీ ఎలాంటి తడబాటు లేకుండా చెలరేగింది. 12వ సీడ్ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది.