ఉత్తరాఖండ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా 38వ జాతీయ క్రీడలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేషనల్ గేమ్స్ లో తెలుగు అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. మనవాళ్లంతా మంచి ప్రదర్శన చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ఖాతాల్లో వరుసగా పతకాలు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది.
మూడో గోల్డ్ మెడల్..
తెలంగాణ క్రీడాకారిణి నిష్కా అగర్వాల్ పసిడి పతకంతో సత్తా చాటింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. తాజాగా జరిగిన టేబుల్ వాల్ట్లో నిష్కా అగర్వాల్ 12.717 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి విజయం సాధించింది. ఫైనల్ లో ఎనిమిది మందితో పోటీపడి ఈ పతకాన్ని ముద్దాడింది. దీంతో ప్రస్తుతం జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఇది మూడో గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఇక ఇదే పోటీలో ప్రణతి నాయక్ (12.700 - ఒరిషా) సిల్వర్ మెడల్, ప్రతిష్ట సమంత (12.484- పశ్చిమ బెంగాల్) బ్రాంజ్ మెడల్ సాధించారు.

రెజ్లింగ్ లో కాంస్యం...
మరోవైపు రెజ్లింగ్లో తెలంగాణకు చెందిన నిఖిల్ యాదవ్ కంచు పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కర్ణాటక రెజ్లర్పై గెలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా బుధవారం పోటీలు ముగిసే సమయానికి తెలంగాణ 25వ స్థానంలో నిలిచి.. తన ఖాతాలో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలతో కలిపి 16 పతకాలు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలతో కలిపి 14 మెడల్స్ తో 18వ స్థానంలో నిలిచింది.