హైదరాబాద్: కళంకితులకు అగ్రపీఠాలు దక్కాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ కామన్వెల్త్ (2010) క్రీడల కుంభకోణంలో నిందితులైన సురేశ్కల్మాడీ, అభయ్సింగ్ చౌతాలాకు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ)లో అత్యున్నత పదవులను దక్కించుకున్నారు.
మంగళవారం జరిగిన ఐవోఏ సర్వసభ్య సమావేశంలో సురేష్ కల్మాడీని జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కల్మాడీతో పాటు వివాదాస్పద నేపథ్యం ఉన్న అభయ్ సింగ్ చౌతాలాను కూడా ఐవోఏ జీవితకాల అధ్యక్షుడయ్యాడు. వీరిద్దరినీ జీవిత కాల గౌరవాధ్యక్షులుగా నియమించడం తీవ్ర వివాదాస్పదమైంది.
996-2011 వరకు కల్మాడీ ఐవోఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా భారీ స్కామ్లకు పాల్పడడంతో 10 నెలల జైలుశిక్ష అనుభవించి బెయిల్పై విడుదలయ్యాడు. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఐవోఏపై సస్పెన్షన్ వేటు వేయడంతో చార్జ్షీట్లో పేరున్న వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులని సవరణ చేశారు.

దాంతో ఆ తర్వాత ఐవోఏపై సస్పెన్షన్ ఎత్తివేసింది. కల్మాడీ తర్వాత 2012-14 మధ్య కాలంలో ఐఓఏ అధ్యక్షుడిగా ఉన్న చౌతాలా మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే హర్యానా ఒలింపిక్ సంఘానికి చౌతాలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కాగా, సురేష్ కల్మాడీ ప్రస్తుతం ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ జీవితకాల అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఆమోదయోగ్యంకాదు: కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్
అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కల్మాడీ, చౌతాలాలకు ఐఓఏ పదవులు కట్టబెట్టడంపై కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ తప్పుపట్టారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 'కల్మాడీ, చౌతాలాలను జీవిత కాల అధ్యక్షులుగా నియమిస్తూ ఐఓఏ చేసిన తీర్మానం షాక్కు గురిచేసింది. వాళ్లిద్దరిపై అవినీతి అభియోగాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని గోయెల్ అన్నాడు.