ప్రస్తుతం 38వ జాతీయ క్రీడలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన లిఫ్టర్ టి.సత్యజ్యోతి, తెలంగాణకు చెందిన షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ మంచి ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ కాంస్య పతకాలను దక్కించుకున్నారు.
వెయిట్ లిఫ్టింగ్ లో తెలుగమ్మాయికి కంచు
మహిళల 87 కేజీల విభాగంలో మొత్తంగా 201 కేజీల బరువెత్తిన సత్య జ్యోతి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. స్నాచ్లో 92 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 109 కేజీలు లిఫ్ట్ చేసింది. ఇక ఇదే విభాగంలో పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మెహక్ శర్మ మొత్తంగా 247 కేజీలు బరువెత్తింది. స్నాచ్లో 106 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్లో 141 కేజీలు లిఫ్ట్ చేసింది. తద్వారా మూడు జాతీయ రికార్డులను బ్రేక్ చేసి అగ్ర స్థానంలో నిలిచింది. స్నాచ్ (105 కేజీలు), క్లీన్ అండ్ జెర్క్ (140 కేజీలు), టోటల్ (244 కేజీలు)లో తన పేరిటే ఉన్న రికార్డులను తానే బ్రేక్ చేసింది. యూపీకు చెందిన పూర్ణిమ 216 కేజీల బరువెత్తి సిల్వర్ మెడల్ ను ముద్దాడింది.

షూటింగ్ లో తెలంగాణ బిడ్డకు కంచు
షూటింగ్ లో... 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో తెలంగాణ అమ్మాయి సురభి (448.8) మూడో స్థానాన్ని దక్కించుకుంది. పంజాబ్ కు చెందిన సిప్త్ కౌర్ (461.2) గోల్డ్ మెడల్, అంజుమ్ మౌద్గిల్ (458.7) సిల్వర్ మెడల్ సాధించారు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల షూటర్ జొనాథన్ ఆంథోనీ (240.7) పసిడిని ముద్దాడాడు. రవీందర్ సింగ్ (240.3- సర్వీసెస్), గుర్ప్రీత్ సింగ్ (220.1- సర్వీసెస్) రజతం, కాంస్యం దక్కించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ మెడల్ విన్నర్ శరబ్జ్యోత్ నాలుగో స్థానంతో నిలిచాడు.
స్విమ్మింగ్ లో దినిది జోరు
స్విమ్మింగ్లో దినిది తన హవా కొనసాగిస్తోంది. ఈ క్రీడల్లో తాజాగా 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో గోల్డ్ మెడల్ దక్కించుకుని.. తన పతకాల సంఖ్యను 9కి పెంచుకుంది. 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్, 4×100 మీటర్ల మిక్స్డ్ రిలేల్లో శ్రీహరి ఇప్పటివరకు 8 మెడల్స్ సాధించాడు.