
టోక్యో: ఒలింపిక్స్ 2021లో రెండో రోజు భారత్కు నిరాశ తప్పలేదు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సింగ్లో మేరీ కోమ్, టేబుల్ టెన్నిస్లో మనికా బాత్రా తప్ప మిగతా పోటీల్లో భారత ప్లేయర్స్ దారుణంగా విఫలమయ్యారు. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్లలో మిశ్రమ ఫలితాలు రాగా.. షూటింగ్, హాకీ, టెన్నిస్, స్విమ్మింగ్లలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. భారత స్విమ్మర్లు మానా పటేల్, శ్రీహరి నటరాజ్ ఆదివారం నిరాశపర్చారు.
మహిళల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగం హీట్-1లో మానా పటేల్ రెండో స్థానంలో నిలిచి సెమీ ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. మానా 1:05.20 నిమిషాల్లో ఈ పోటీలను పూర్తి చేయగా.. జింబాబ్వేకు చెందిన స్విమ్మర్ డొటానా కటాయి 1:02.73 నిమిషాల్లో పూర్తి చేసి తొలి స్థానం సంపాదించింది. గ్రెనాడాకు చెందిన కింబర్లీ ఇన్స్ 1:10.24 నిమిషాల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. టాప్-16లో నిలిచిన స్విమ్మర్లే సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తారు. 39వ స్థానంలో ఉన్న మానా.. అర్హత సాధించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న మానాపటేల్ 'యూనివర్సాలిటీ కోటా' కింద ఈ విశ్వక్రీడల్లో పోటీపడింది.
టోక్యో ఒలింపిక్స్లో పురుషుల 100 మీ బ్యాక్స్ట్రోక్ విభాగం హీట్-3లో సెమీస్కు అర్హత సాధించడంలో యువ భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కూడా విఫలమయ్యాడు. హీట్-3లో శ్రీహరి 54.31 సెకన్లలో పోటీలను పూర్తిచేసి.. ఐదవ స్థానంలో నిలిచాడు. మొత్తంగా 27వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే మానా పటేల్ కంటే శ్రీహరి నటరాజ్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు.
హాకీలో భారత జట్టు దారుణమైన ప్రదర్శన చేసింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిచి బోణీ చేసిన భారత్.. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 1-7 తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. రెండో క్వార్టర్లో మరో మూడు గోల్స్ చేసి 4-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో క్వార్టర్లో గోల్ చేసిన భారత్ ఆసీస్ ఆధిక్యాన్ని 1-4కు తగ్గించింది. ఆ వెంటనే ఆస్ట్రేలియాకు మరో రెండు గోల్స్ సమర్పించుకుంది. చివరి క్వార్టర్లో మరో గోల్ చేసిన ఆస్ట్రేలియా 7-1తో విజయం సాధించింది.