రాంచీ: ప్రపంచ మెగా ఈవెంట్ అయిన ఒలింపిక్స్లో పాల్గొనాలంటే మామూలు విషయం కాదు. ఇక పతకం గెలవాలంటే ఏళ్లపాటు నిరంతర కఠోర శ్రమ తప్పదు. అందుకే ఓ క్రీడాకారిణి 2020 ఒలింపిక్స్ను లక్ష్యంగా చేసుకుని ఇప్పట్నుంచే కఠోర సాధన చేస్తోంది. ఆమే జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన 16ఏళ్ల రాష్ట్ర స్థాయి స్విమ్మర్ రేఖా కుమారి.
23ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించిన అమెరికా దేశానికి చెందిన స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ తనకు స్ఫూర్తి అని చెబుతోంది. 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం రేఖాకుమారి సంసిద్ధమవుతోంది. తనకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో లేనప్పటికీ.. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుదూసుకెళ్తోంది ఈ క్రీడాకారిణి.
రాంచీ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యామ్ నీటిలో తోటి యువతీ, యువకులతో కలిసి రేఖాకుమారి ఈతలో శిక్షణ పొందుతున్నారు. రాంచీలోని స్టేడియంలో 2011వ సంవత్సరంలోనే స్విమ్మింగ్ పూల్ నిర్మించినా అధికారులు దాని తలుపులు మాత్రం తెరవడం లేదు.

డ్యామ్లో ఈత కొట్టడం ప్రమాదమని తెలిసినా పట్టుదలగా రేఖాకుమారి శిక్షణ పొందుతున్నారు. డ్యామ్లో డైవింగ్ చేసేందుకు సరైన పాయింట్ లేకున్నా రేఖాకుమారితోపాటు ఇతర విద్యార్థులు డ్యామ్లోనే శిక్షణ పొందుతున్నారని కోచ్ ఉమేష్ కుమార్ చెప్పారు.
'డ్యామ్లో ప్రవహిస్తున్న నీటిలో ఈత కొట్టడానికి నేను ముందు భయపడినా, 2020 టోకియో ఒలింపిక్స్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించి మెడల్ సాధించాలనే పట్టుదలతో ఈతలో కఠోర శిక్షణ పొందుతున్నాను' అని రేఖా కుమారి చెబుతోంది. ఆమె కఠోర పరిశ్రమ, పట్టుదలకు ఎవరైనా అభినందించకుండా ఉండలేరు. ఆమె 2020లో భారత్కు పతకం తీసుకురావాలని మనమూ కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్ రేఖా కుమారి అంటూ.