హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా ముగిసిన 18వ ఆసియా గేమ్స్లో హెప్టాథ్లాన్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా స్వప్న బర్మన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. హెప్టాథ్లాన్ అంటే ఏడు ఆటలు కలిపిన ఈవెంట్. రెండు రోజులపాటు జరిగిన ఏడు క్రీడల్లో మొత్తం 6026 (కెరీర్ బెస్ట్) పాయింట్లతో హెప్టాథ్లాన్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
స్వర్ణ విజేత స్వప్న వెనుక ద్రవిడ్.., తల్లి భావోద్వేగం
ఇందులో 100 మీటర్ల పరుగు, హైజంప్, షాట్పుట్, 200 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల పరుగు ఉంటాయి. పంటినొప్పితో బాధపడుతూనే స్టిక్కర్ వేసుకొని మరీ ఒక్కో ఈవెంట్లో ఆడిన స్వప్న బర్మన్ తన స్వర్ణ పతకం సాధించాలన్న కలను సాధించుకుంది. ఆసియా గేమ్స్ ముగించుకుని జకార్తా నుంచి స్వదేశానికి వచ్చిన స్వప్న బర్మన్కు ఆ ఊరి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
రాజ్బోంగ్షీ తెగకు చెందిన దిగువ మధ్య తరగతి కంటే తక్కువస్థాయి నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఊరికి కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఆసియా గేమ్స్లో స్వర్ణం గెలిచిన సందర్భంగా స్వప్నను పలకరించడానికి వచ్చే వీఐపీలందరూ స్వప్న ఇంటి ముందు రోడ్డు పరిస్థితి చూసి చలించిపోయారు.
దీంతో ఆమె ఊరికి వెంటనే కాంక్రీటు రోడ్డును మంజూరు చేశారు. పశ్చిమ్బంగాలోని జల్పాయ్గురి పట్టణానికి శివారులో ఉన్న ఘోస్పారా స్వప్న సొంత ఊరు. ఇక్కడ నివసించే వాళ్లందరూ టీ గార్డెన్స్లో పనిచేసేవాళ్లే. ఈ ఊరి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. అయితే, స్వప్న స్వర్ణం గెలిచిన తర్వాత ఆ ఊరి రూపు రేఖల్లో మార్పు వస్తోంది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
స్వప్న కోసం వచ్చిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ ఊరిని బాగు చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. దీంతో తొలుత ఆమె ఊరికి కాంక్రీటు రోడ్డుని వేశారు. ఆ తర్వాత ఆ ఊరికి తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.