
హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతకం గెలిచిన సుశీల్ కుమార్ అంతర్జాతీయ రెజ్లింగ్లోకి ఘనంగా పునరాగమనం చేశాడు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో జరుగుతున్న కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకం సాధించాడు.
మూడేళ్ల విరామం తర్వాత తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో తలపడ్డ సుశీల్ 74 కిలోల ఫ్రీస్టయిల్ కేటగిరీ ఫైనల్లో న్యూజిలాండ్కు చెందిన ఆకాశ్ ఖుల్లర్పై విజయం సాధించాడు. సుశీల్ చివరిసారిగా అంతర్జాతీయ ఈవెంట్లో 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గాడు.
ఆ తర్వాత మరే అంతర్జాతీయ టోర్నీలోనూ ఆడని సుశీల్.. నవంబర్లో జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో పాల్గొని స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. మరోవైపు సుశీల్ కేటగిరీలోనే భారత్కు చెందిన మరో రెజ్లర్ ప్రవీణ్ రాణా కాంస్య పతకం సాధించాడు.
మరో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కూడా సత్తా చాటింది. మహిళల 62 కిలోల ఫ్రీస్టయిల్ కేటగిరీ ఫైనల్లో సాక్షి మాలిక్ 13-2 స్కోరు తేడాతో న్యూజిలాండ్ రెజ్లర్ టేలా టౌహిన్పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 59 పతకాలను సొంతం చేసుకుంది.
ఇందులో 29 స్వర్ణాలు, 24 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి. రెండోరోజు భారత్ ఖాతాలో ఫ్రీస్టయిల్ విభాగంలో పది స్వర్ణాలు, ఏడు రజతాలు, రెండు కాంస్యాలు చేరాయి.