
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి పతకం అందించిన వెయిట్ లిప్టర్ గురురాజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోటీలు ప్రారంభమైన తొలిరోజే గురురాజా భారత్కు పతకం అందించిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించిన విధంగానే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్కు పతకం వచ్చింది.
అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత్కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ 'ఈ పతకం నాకు అంత సలువుగా ఏమీ దక్కలేదు. మొదటి రెండు (క్లీన్ అండ్ జర్క్) ప్రయత్నాల్లో ఫెయిలయ్యాను' అని అన్నాడు.
'చివరిదైన మూడో ప్రయత్నానికి వెళ్లే ముందు నా కోచ్ వచ్చి నాలో ఎంతో స్ఫూర్తి నింపాడు. దీనిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ కుటుంబం, దేశం నువ్వు పతకం తెస్తావని ఆశగా ఎదురుచూస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఎలాగైనా పతకం సాధించాలన్న కసిని పెంచాయి' అని చెప్పాడు.
'చివరకు విజయం సాధించాను. రజత పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్కు సిద్ధం అవుతాను. నేషనల్ ఫెడరేషన్ నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. నా కోసం ఎంతో మంది కోచ్లు కష్టపడ్డారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా' అని గురురాజా పేర్కొన్నాడు.
'2010 కామన్వెల్త్ క్రీడల్లో సుశీల్ కుమార్ రెజ్లింగ్ పోటీలు చూశాను. ఈ సమయంలోనే నేను వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాను. మొదట్లో ఈ బార్ను ఎలా ఎత్తాలో కూడా తెలియదు. చాలా కష్టం అనిపించేది. ఆ తర్వాత నా ప్రాక్టీస్ సెషన్స్ను పెంచి విజయాలు సాధించడం మొదలుపెట్టాను' అని గురురాజా తెలిపాడు.
ఇదిలా ఉంటే కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి పతకం అందించిన గురురాజాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపాడు. 'మనం మొదటి పతకాన్ని సాధించాం. 56కేజీల విభాగంలో మొత్తం 249 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించావు. నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.