న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ రెజ్లర్ సునీల్ కుమార్ సత్తాచాటాడు. గ్రీకో రోమన్ విభాగంలో 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. భారత దేశం తరఫున తొలి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన 87 కేజీల ఫైనల్లో సునీల్ కుమార్ 5-0తో అజత్ సాలిదినోవ్ (కిర్గిస్థాన్)పై విజయం సాధించాడు. గత చాంపియన్షిప్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న సునీల్ ఈసారి మాత్రం దుమ్మురేపాడు.
'తప్పుల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటా.. భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు సాయపడతా'
మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు గ్రీకో రోమన్ శైలిలో భారత్కు ఒక స్వర్ణం, ఒక కాంస్యం లభించాయి. పురుషుల 87 కేజీల విభాగంలో సునీల్ పసిడి పతకం సాధించగా.. 55 కేజీల విభాగంలో అర్జున్ హలకుర్కి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సునీల్ 5-0తో అజత్ సలిదినోవ్పై గెలిచాడు. తద్వారా పప్పూ యాదవ్ (1993లో; 48 కేజీలు) తర్వాత ఆసియా రెజ్లింగ్ పోటీల్లో గ్రీకో రోమన్ శైలిలో భారత్కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్గా సునీల్ రికార్డుల్లోకి ఎక్కాడు.
సెమీస్లో సునీల్ 12-8తో అజ్మత్ (కజకిస్థాన్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో 8-2తో తకహిరో సురుడా (జపాన్)పై నెగ్గాడు. మరోవైపు 55 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కర్ణాటక రెజ్లర్ అర్జున్ 7-4తో డాంగ్హైక్ వన్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. ఇతర విభాగాల్లో సచిన్ రాణా (63 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) విఫలమయ్యారు. 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మెహర్ సింగ్ (భారత్) 2-3తో రోమన్ కిమ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
భారత్లో కరోనా వైరస్ ప్రభావం లేకున్నా.. పోటీలు జరుగుతున్న కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జపాన్, కొరియా, చైనీస్ తైపీకి చెందిన కొందరు రెజ్లర్లు ముఖాలకు మాస్క్లు ధరించారు.