హైదరాబాద్: లండన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో తొలి రోజే భారత్కు స్వర్ణం దక్కింది. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత్కు చెందిన సుందర్ సింగ్ గుల్జార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
60.36 మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి భారత్కు తొలి స్వర్ణం అందించాడు. ఈ క్రమంలో సుందర్ సింగ్ వ్యక్తిగత రికార్డుని కూడా నమోదు చేశాడు. శ్రీలంకకు చెందిన దినేశ్ ప్రియాత హెర్నాత్ 57.93 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచాడు.
పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. 21 ఏళ్ల సుందర్ గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్లో పాల్గొన్న గుల్జార్ అర్హత పోటీల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫైనల్ పోటీల్లో పాల్గొనలేకపోయాడు.
ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఫజా ఐపీసీ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో పాల్గొన్న గుల్జార్ జావెలిన్ త్రో, షాట్పుట్, డిస్కస్ త్రోలో మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు. పురుషుల షార్ట్పుట్ విభాగంలో వీరేందర్ ధావర్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్ పోటీల్లో అతను నాలుగో స్థానంతో నిలిచాడు.
కాగా, లండన్ వేదికగా పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 90 దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్కి హాజరయ్యారు. 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో సుమారు 202 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.