
హైదరాబాద్: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఒలింపిక్ పతక విజేత భారత అగ్రశ్రేణి రెజ్లర్ సాక్షి మాలిక్.. వరల్డ్ చాంపియన్షిప్ లో పాల్గొనే భారత జట్టులో చోటుదక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ట్రయల్స్లో ఆమె పోటీ పడకుండానే ఈ అవకాశం దక్కించుకుంది. సాక్షితో తలపడాల్సిన సరిత మోర్ ట్రయల్స్ నుంచి తప్పుకోవడమే దానికి కారణం.
మహిళల రెజ్లింగ్ 62 కిలోల విభాగం బెర్త్ కోసం సాక్షి, సరితా మోర్ మధ్య ట్రయల్ బౌట్ను ఏర్పాటు చేశారు. కానీ, సరిత గాయం కారణంగా వైదొలగడంతో సాక్షి చెమటోడ్చకుండానే వరల్డ్ చాంపియన్షిప్కు అర్హత సాధించింది. సాక్షి, సుశీల్ కుమార్ను ట్రయల్స్ కోసం హాజరుకావాల్సిందిగా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) ఆదేశించింది.
డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ మాట్లాడుతూ.. 'ట్రయల్స్లో ఇంకా నాలుగు కేటగీరీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తరుణంలో 65 కేజీల విభాగంలో భజరంగ్ను, 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ను ఎంపిక చేయగా, సాక్షితో తలపడాల్సిందిగా సరితాను నిర్ణయించాం. కానీ, సరితా మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి వైదొలిగింది. దీంతో సాక్షి మాలిక్నే తుది పోటీలో ఎంపిక చేశాం'
అని పేర్కొన్నారు.
పేలవ ఫామ్ కారణంగా సుశీల్ ముందుగానే తప్పుకున్నాడు. ఆసియా స్వర్ణ పతక విజేతలు బజరంగ్ పూనియా, వినేష్ ఫొగట్కు నేరుగా ఎంట్రీ లభించింది. 53 కిలోల విభాగంలో రితు ఫొగట్, పింకీ మధ్య మంగళవారం ట్రయల్ బౌట్ జరగనుంది. హంగరీ రాజధాని బుడాపెస్ట్లో వచ్చే నెల 20 నుంచి వరల్డ్ చాంపియన్షిప్ జరగనుంది.