న్యూఢిల్లీ: ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ, టోర్నమెంట్ టైటిల్ స్పాన్సర్ డిఎల్ఎఫ్ పై కేంద్ర క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఇండియా పదాన్ని దుర్వినియోగం చేయవద్దని ఆదేశించింది. డిఎల్ఎఫ్ లోగోపై బిల్డింగ్ ఇండియా ట్యాగ్ లైన్ ఉంటుంది. దాన్ని బౌలర్ల రన్నప్ ఏరియాలో దాన్ని ఉంచడం వల్ల క్రీడా మంత్రిత్వ శాఖ ఆగ్రహం చెందింది. ఇండియా అనే పదాన్ని బౌలర్లు తరుచూ తొక్కుతుండడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని, దేశానికి అగౌరవం జరిగినట్లుగా భావిస్తారని ఆ లేఖలో తెలిపింది. ఆ విధమైన దుర్వినియోగాన్ని డిఎల్ ఎఫ్ వెంటనే ఆపేయాలని కోరింది. లేకపోతే తగిన చర్యల కోసం ట్రేడ్ మార్కు కమిషనర్ వద్దకు వెళ్తామని హెచ్చరించింది. ఆ లేఖపై సంయుక్త కార్యదర్శి ఇంజేతి శ్రీనివాస్ సంతకం చేశారు. కేసు అలహాబాద్ హైకోర్టులో ఉందని తెలిపింది. ఆ విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ బిసిసిఐకి కూడా తెలిపింది. తగిన సమాధానం ఇవ్వాలని బిసిసిఐ లలిత్ మోడీని, డిఎల్ఎఫ్ ను అడిగే అవకాశం ఉంది. ఇండియా పదం దుర్వినియోగం కాకుండా తదుపరి మ్యాచులకైనా చర్యలు తీసుకోవాలని క్రీడా మంత్రిత్వ శాఖ లలిత్ మోడీకి సూచించింది. ఈ మేరకు మోడీకి విడిగా లేఖ రాసింది.