హైదరాబాద్: భారత స్క్వాష్ జట్టు విదేశీ కోచ్ అచ్రఫ్ ఎల్ కరర్గుయ్ అనూహ్య పరిస్థితుల దృష్ట్యా స్వదేశాని(ఈజిప్టు)కి వెళ్లాడు. అయితే, మరో నెలలో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు తిరిగి వచ్చే దానిపై అనుమానంగా ఉంది. కోచ్ అచ్రఫ్ పదవీ కాలాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) జూలై 2019 వరకు పొడిగించింది.
అయినా సరే ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళుతున్నట్టు చెప్పడం అనేక సందేహాలకు తావిస్తోంది. అచ్రఫ్ రాజీనామాపై శాయ్ అధికారి మాట్లాడుతూ పది రోజుల క్రితం అతడు వ్యక్తిగత కారణాల వల్ల కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నాని చెప్పాడు. అయితే తాము కామన్వెల్త్ గేమ్స్ వరకు ఉంటాడని భావించామని తెలిపాడు.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. భారత్ తరుపున స్క్వాష్ క్రీడకు ప్రాతినిథ్యం వహిస్తున్న జోష్న చినప్ప, దీపిక పల్లికల్, సౌరవ్ ఘోషాల్.. గతంలో అనేకసార్లు అచ్రఫ్ కోచింగ్ శైలి బాగుందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత జోడీ జోష్న చినప్ప-దీపిక పల్లికల్ జోడీ స్వర్ణం సాధించింది.
ఈ ఏడాది ఇండోనేషియాలో జరిగే ఆసియా గేమ్స్లో కూడా పతకం రేసులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అచ్రఫ్ తన సొంత దేశమైన ఈజిప్టుకి తిరిగి వెళ్లిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్యతో విభేదాలే అచ్రఫ్ తిరిగి వెళ్లిపోవడానికి కారణమని, అందుకే కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.