విష్ణువర్ధన్ వరల్డ్ ర్యాంకింగులో 328వ స్థానంలో ఉన్నాడు. అయితే, ఇటీవల అతను సాధించిన విజయాలు అతనికి పేస్తో జత కట్టే అవకాశాలను కల్పించాయని అంటున్నారు. చైనాలో జరిగిన 2010 ఆసియా క్రీడల్లో కాంస్య సాధించిన భారత జట్టులో అతను ఉన్నాడు. మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో జత కట్టి వెండి పతకం సాధించాడు. భారత టెన్నిస్కు సంబంధించి పేస్, మహేష్ భూపతి వారసుడిగా విష్ణువర్ధన్ ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
డేవిస్ కప్కు అతను ప్రాతినిధ్యం వహించాడు. ఉజ్బెకిస్తాన్, పిలిప్పైన్స్లను ఓడించి వరల్డ్ గ్రూప్నకు అర్హత సాధించిన జట్టులో అతను ఉన్నాడు. విష్ణు తొలిసారి డేవిస్ కప్లో సెప్టెంబర్ 18వ తేదీన జపాన్కు చెందిన కీ నిషికోరీతో తలపడ్డాడు. అయితే, వరుస సెట్లలో అతను ఓడిపోయాడు.
హైదరాబాదుకు చెందిన విష్ణువర్ధన్ 1987 జులై 27వ తేదీన జన్మించాడు. 2003లో అతను జూనియర్ నేషనల్ టైటిల్ గెలుచుకున్నాడు. డేవిస్ కప్ జూనియర్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. డేవిస్ కప్లో పేస్తో కలిసి తాను ప్రాక్టీస్ చేసినట్లు విష్ణువర్ధన్ తెలిపాడు. ఒలింపిక్స్ కోసం లండన్ వెళ్లి ప్రాక్టీస్ చేస్తానని అతను అన్నాడు. డబుల్స్లో ర్యాంకింగ్ మెరుగ్గా ఉండడంతో పేస్తో జత కట్టే అవకాశం విష్ణువర్ధన్కు దక్కినట్లు భావిస్తున్నారు. తనకు ఇది మంచి అవకాశమని అతను భావిస్తున్నాడు.