
దీంతో విజయ్ పులకించిపోయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ 'నిజంగా నాకు అద్భుతమైన స్వాగతం లభించింది. ఇది నా హృదయాన్ని తాకింది. ఇలాంటిది నా కెరీర్లో జరగడం ఇదే మొట్టమొదటిసారి' అని అన్నాడు. 25మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో ఈ ఘనత సాధించిన విజయ్ రాక కోసం ఆర్మీ నుంచి పెద్ద ఎత్తున అధికారులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున డ్రమ్స్ వాయించడంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు.
తను పనిచేసే 16 డోగ్రా రెజిమెంట్ అధికారులతో పాటు తల్లిదండ్రులు, అమ్మమ్మ, 40 వుంది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) అధికారులు హాజరయ్యారు. 'విజయ్ కుమార్ జిందాబాద్', భారత ఆర్మీ జిందాబాద్' అనే నినాదాలతో హోరెత్తించారు. లండన్లో పతకం సాధించిన వెంటనే తాను ఆర్మీ నుంచి వైదొలుగుతానని విజయ్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ఎ.కె.ఆంటోనీకి క్రీడల మంత్రి అజయ్ మాకెన్ ఓ లేఖ కూడా రాశారు.
ఆ లేఖలో విజయ్కుమార్ లాంటి వారికి పదోన్నతులు కల్పించే విశయంలో కొన్ని నిబందనలను సవరించాలని, ఇలాంటి వారిని ప్రోత్సహించడం వల్ల క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందిని లేఖలో వివరించారు. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన సైన్యం తనకు పదోన్నతితో పాటు రూ.30 లక్షల నజరానా ఇవ్వాలని యోచిస్తోంది. మరోవైపు విజయ్ను సమున్నతంగా గౌరవిస్తామని ఎన్ఆర్ఏఐ సలహాదారు బల్జీత్ సింగ్ తెలిపారు. ప్రధాని దగ్గరికి తీసుకెళ్లిన అనంతరం ఘన సన్మానానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
అంతేకాకుండా ఒలింపిక్స్లో పతకం సాధించుకొచ్చిన ఓ క్రీడాకారుడికైనా ఉద్యోగం ఇస్తామని, అది కూడా ఐఎఎస్, గ్రూప్-బి, కోచ్ స్థాయి ఉద్యోగం ఇస్తామని స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ద్వారా అజయ్ మాకెన్ మరోమారు పిలుపునిచ్చారు. ఈ తరహాలో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు కూడా ప్రోత్సహిస్తామని క్రీడల మంత్రి అజయ్ మాకెన్ మంగళవారం నాడు ట్విట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్కుమార్ ధుమల్ మాట్లాడుతూ లండన్ ఒలింపిక్స్లో కాంస్య తపకం సాధించుకొచ్చిన విజయ్కుమార్కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని అన్నారు. ఈ విషయంపై ప్రధాన మంత్రికి లేఖ రాసిన ఆయన విజయ్కుమార్ సాధించిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలోని పతకం భవిష్యత్తు తరాలకు స్పూర్తినిస్తుందన్నారు. ఇప్పటికే విజయ్కు కోటి రూపాయల నజరానా ప్రకటించిన మా ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో 'హిమాచల్ గౌరవ్ అవార్డు'ను ప్రదానం చేస్తామన్నారు.
తెలుగు వన్ఇండియా