
అవినీతి ఆరోపణలపై తన మీద విచారణ జరుగుతున్నందున సంఘాన్ని తాను నిర్వహించబోనని కల్మాడీ చెప్పుకున్నారు. భారతదేశంలో 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ చైర్మన్గా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కల్మాడీ దాదాపు ఏడాది పాటు ఆయన జైలులో ఉన్నారు.
కల్మాడీ వ్యక్తిగత హోదాలో క్రీడలకు హాజరు కావడాన్ని తాము అభ్యంతర పెట్టబోమని అంటూనే హైకోర్టు అయితే ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసే వరకు దేశం విడిచి వెళ్లరాదనే ఆదేశాలు జారీ చేసింది. ఒలింపిక్స్కు కల్మాడీ ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లబోరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే కల్మాడీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జాతీయ దృష్టి కోణం నుంచి తాము నిర్ణయం తీసుకున్నామని, ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కల్మాడీ పాల్గొనకూడదని చెప్పింది. కల్మాడీ పాల్గొనడం దేశానికి ఇబ్బందికరమని వ్యాఖ్యానించింది.
కల్మాడీని కాంగ్రెసు పార్టీ సస్పెండ్ చేసింది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి వెళ్లాలనే ఉద్దేశ్యాన్ని స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని క్రీడల మంత్రి అజయ్ మకెన్ కల్మాడీకి సూచించారు. అయితే, అందుకు కల్మాడీ నిరాకరించారు. తాను ఆసియా అథ్లెట్స్ సంఘం అధ్యక్షుడిగా, అంతర్జాతీయ సంఘాల అథ్లెట్స్ సమాఖ్య మండలి సభ్యుడిగా ఉన్నానని కల్మాడీ చెప్పారు.
కల్మాడీపై దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పు వెలువరించింది. కల్మాడీ హాజరు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. 2012 లండన్ ఒలింపిక్స్కు వెళ్లడానికి సిబిఐ ప్రత్యేక కోర్టు కల్మాడీకి జూలై 26 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు అనుమతి ఇచ్చింది.