లండన్, జులై 31: జులై 30 (సోమవారం) భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. కారణం హైదరాబాద్కు చెందిన షూటర్ గగన్ నారంగ్ లండన్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించాడు. అంతేకాదు లండన్ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన తొలి పతకం ఇదే కావడం విశేషం. వూల్విచ్లోని రాయల్ ఆర్టిలరీ బ్యారెక్స్లో జరిగిన పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో నారంగ్ మూడో స్థానంలో నిలిచి భారత్కు కాంస్య పతకం వచ్చేలా చేశాడు. దీంతో యావత్ భారతావని మొత్తం ఎవరీ గగన్ నారంగ్ అంటూ వెతకడం మొదలు పెట్టారు.

దీంతో పాఠకులకు గగన్ నారంగ్ గురించిన పూర్తి సమాచారం విపులంగా అందజేస్తున్నాం.. తల్లి దండ్రులు: అమృతజిత్ నారంగ్, బిఎస్ నారంగ్. 29 సంవత్సరాల వయసు కలిగిన గగన్ నారంగ్ మే 6, 1983న చెన్నైలో జన్మించిన, బాల్యం మొత్తం హైదరాబాద్లోనే గడిచింది. హైదరాబాద్లోనే చదువు కొనసాగించాడు. వాస్తవానికి గగన్ కుటుంబం హర్యానాకు చెందినది. అయితే అతని తండ్రి బి.ఎస్. నారంగ్ ఎయిర్ఫోర్స్ సంస్థలో ఉద్యోగి. దీంతో నారంగ్ కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. వీరి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. తన చిన్న తనంలో కాలక్షేపం కోసం తన తండ్రితో కలిసి మెరీనా బీచ్కు వచ్చాడు. అక్కడే బెలూన్లతో కూడిన ఒక స్టాల్ కనిపించింది. సరదా కోసం బొమ్మ తుపాకీతో బెలూన్లను గురి చేసి కొట్టాడు. అక్కడ మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం భారత్కు తొలి పతకం అందించిన ఘనుడిగా అతణ్ని వరించేలా చేసింది.
ఆ తర్వాత పదిహేనేళ్ల క్రితం షూటింగ్ను సీరియస్గా తీసుకుని తన గురికి పదునుపెట్టిన గగన్ తొలిసారి 2003 ఆఫ్రో-ఆసియా క్రీడల సందర్భంగా వెలుగులోకి వచ్చాడు. చివరి నిమిషంలో బరిలోకి దిగిన అతను 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి భారత్కు తొలి పతకాన్ని అందించాడు. లండన్ ఒలింపిక్స్కు ముందు గగన్ ఒక అంతర్జాతీయ షూటర్గా అన్ని స్థాయిల్లో పతకాలు సాధించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఫైనల్కు చేరుకోవడంలో విఫలమయ్యాడు.
దీంతో లండన్ ఒలింపిక్స్ కోసం కసరత్తు ప్రారంభించాడు. పుణెలోని 'గన్ ఫర్ గ్లోరీ' అకాడమీతోపాటు జర్మనీలో శిక్షణ కొనసాగించాడు. దీంతో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న ఒలింపిక్ పతకం తన ఖాతాలో వేసుకోనితన కెరీర్కు ఒక పరిపూర్ణతను చేకూర్చాడు. లండన్ ఒలింపిక్స్లో గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించడంతో బేగంపేట్లోని గంగకావేరి ఆపార్టుమెంట్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు స్వీట్స్ పంపిణీ చేస్తూ, టాపాకాయలు కాల్చి సంబరాలను జరుపుకున్నారు. దీంతో కాంస్యపథకాన్ని నగరవాసి కైవసం చేసుకోవడంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ క్రీడాపోటీలలో తన కుమారుడు పాల్గొని భారతదేశం తరుపున కాంస్యపతకాన్ని కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని గగన్నారంగ్ అమ్మ అమృతజిత్నారంగ్ అన్నారు. పోటీలలో పాల్గొనడానికి వెళ్లే ముందు నా కుమారుడు దృఢసంకల్పంతో అమ్మ నేను గెల్చేస్తానని చెప్పడం, నిజంగానే విజయం సాధించి రావడం మరువలే నిదని గగన్నారంగ్ తలిదండ్రులు అన్నారు.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని.. ఆరు నెలల క్రితం గగన్ నారంగ్ను ఈ ప్రశ్న అడిగితే... ముసిముసి నవ్వులతో ఓ సమాధానం చెప్పాడు. 'ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన లేదు. ముందు లండన్లో పతకం గెలవాలి. ఆ తర్వాతే పెళ్లి' అన్నాడు. నిజానికి ఒలింపిక్స్లో పతకం సాధించాలని నాలుగేళ్ల నుంచి తహతహలాడుతున్నాడు. బీజింగ్ తర్వాత పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ పతకం కసి కన్పించింది. రెండుసార్లు ప్రపంచ రికార్డును సమం చేశాడు.
తెలుగు వన్ఇండియా