
ఇక సుశీల్ కుమార్ 66 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ రజతం గెలవడం వల్ల వరుసగా రెండు ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఒలింపిక్స్లో తొలిసారి భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఢిల్లీ శివార్లలోని బోప్రాలా (నజఫ్ గడ్ ప్రాంతం) గ్రామానికి చెందిన సుశీల్ కుటుంబంలో చాలా మంది రెజ్లర్లు ఉన్నారు. అతని తాత, తండ్రి, సోదరుడు సందీప్ అందరూ రెజ్లర్లే. అనుకోకుండా వీరు ముగ్గురు మధ్యలో రెజ్లింగ్ను వదిలివేశారు.
ఒకరికి మించి రెజ్లర్ అయ్యే అవకాశం లేని పేద కుటుంబం వారిది. అందుకే సుశీల్ కుమార్ను ఉత్తమ రెజ్లర్గా తీర్చిదిద్దారు. సుశీల్ కుమార్ తండ్రి దివాన్ సింగ్ బస్ డ్రైవర్. ఆదాయంలో ఎక్కువ భాగం సుశీల్ శిక్షణకే కేటాయించేవారు. 14 యేళ్ల నుండే సుశీల్ కుమార్ ఛత్రశాల్ స్డేడియంలోనే ఉంటూ శిక్షణ తీసుకునే వాడు. రోజూ అక్కడికి క్యాస్లో పాలు, డబ్బాలో నెయ్యి, ఉడికించిన కూరగాయలు పంపేవారు. సుశీల్ కుమార్ కోసం గ్రామస్దులు కూడా కాస్త కుటుంబానికి సాయం చేసేవారు.
సుశీల్లోని నిబద్దత అతన్ని ఈరోజు ఇంతటి వాడిని చేసిందంటారు అతని కోచ్లు. అందుకు 2007లో జరిగిన ఒక సంఘటను గుర్తు చేశారు. 2007వ సంవత్సరంలో తన తాత గారు చనిపోయాడు. ఆయన కూడా రెజ్లరే. సుశీల్ కుస్తీ వైపు వెళ్లడానికి కారణం ఆయనే. మనవడిని ఒలింపిక్ ఛాంపియన్గా చూడాలన్నది ఆయన ఆశయం. అది తీరకుండానే ప్రాణాలు వదిలాడు. తన తాత చనిపోయిన మరుసటి రోజే పొద్దునే ప్రాక్టీస్కు వచ్చాడు సుశీల్. అదేంటని కోచ్ యశ్వీర్ అడడగా మా తాత కల నెరవేర్చాలి అని బదులిచ్చాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించినప్పుడు అనేక సన్మాన కార్యక్రమాలకు హాజరైనా విశ్రాంతి తీసుకోకుండా సుశీల్ ఇప్పటికీ ప్రాక్టీస్ చేసేవాడు.
తెలుగు వన్ఇండియా