న్యూఢిల్లీ, జులై 16: మరికొద్ది రోజుల్లో లండన్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్న సందర్బంగా లండన్ ఒలంపిక్స్ 2012కు ముఖ్య స్పాన్సర్గా వ్యవహారిస్తున్న ఓఎన్జీసీ భారత క్రీడాకారులకు భారీ నజరానాలను ప్రకటించింది. లండన్ ఒలంపిక్స్లో బంగారు పతకం గెలిచిన ఆటగాళ్లకు రూ 25 లక్షల నగదు పురస్కారాన్ని ఇస్తామని ఓఎన్జీసీ ప్రకటించింది. అదే విధంగా రజతం, కాంస్య పతకాలు సాధించిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ 15 లక్ష లు, 10 లక్షల నజరానాను అందిస్తామని పేర్కొంది.

ఒలింపిక్స్లో విజయం సాధించే ఓఎన్జీసీ ఉద్యోగులకు సైతం ఈ నగదు బహుమతి వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఓఎన్జీసీ ఉద్యోగి కాకపోయినా... పతకాలు సాధించిన వారందరికీ ఈ క్యాష్ అవార్డులను అందజేస్తామని తెలిపారు. లండన్ ఒలంపిక్స్కు మొత్తం 81 మంది అథ్లెట్లు లండన్ ఒలింపిక్స్కు అర్హత సాధించగా, వారిలో 16 మంది ఓఎన్జీసీకి చెందినవారు ఉండడం విశేషం.
ఈ 16 మందికి ఒక్కొక్కరికీ రూ 3 లక్షల నగదు పురస్కారాన్ని కూడా ఇవ్వనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందానికి ముఖ్య స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఓఎన్జీసీ ఆదివారం లండన్ బయలుదేరిన ఆరుగురు ఆర్చర్లు, ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా క్రీడా విభాగం