ఏఐటీఏ సూచించిన ప్రత్యామ్నాయాలు:
* సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పేస్, భూపతి జట్టుగా ఒలంపిక్స్కు వెళ్లాలి.
* అలా కుదరకపోతే పేస్, బోపన్న కలిసి వెళ్లాలి. ఒక్క జట్టే పంపాలని నిర్ణయించుకున్నారు కాబట్టి దీంతో భూపతికి ఒలింపిక్స్ ఆడే అవకాశం దక్కదు.
* రెండు జట్లను పంపాలంటే పేస్కు జతగా యూకీ బాంబ్రీ లేదా విష్ణువర్ధన్ను ఎంపిక చేయాలి. భూపతి, బోపన్న జంటగా మరో జట్టు ఉంటుంది.
* ఒకవేళ తక్కువ ర్యాంక్ ఆటగాడితో ఒలింపిక్స్ వెళ్లేందుకు పేస్ ఇష్టపడకపోతే భూపతి, బోపన్నతో కూడిన జట్టును మాత్రమే పంపాలి.
* చివరిగా పేస్ను ఓ జూనియర్ ఆటగాడితో పంపి భూపతి, బోపన్నలపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలి.
లియాండర్పేస్, మహేష్భూపతి జోడీని లండన్ ఒలింపిక్స్కు పంపుతామని మంగళవారం అఖిల భారత టెన్నిస్ క్రీడాకారుల సంఘం (ఏఐటీఎం) తేల్చి చెప్పింది. తాను తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ లియాండర్ పేస్కు జోడీగా తనను ఎఐటిఎ ఎంపిక చేయడంపై భూపతి క్రీడా మంత్రిత్వశాఖకు ఒక లేఖలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రంగప్రవేశం చేయడంతో ఏఐటీఎం స్పందించింది.
భూపతి, బోపన్న జంటను ఒలింపిక్స్కు పంపుతామని తామేనాడూ హామీ ఇవ్వలేదని చెప్పింది. ఈ మేరకు క్రీడా శాఖకు లేఖ రాసింది. అంతర్జాతీయంగా పేస్ చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. భూపతి, బోపన్నలలో ఒకరు ఆడితేనే బావుంటుంది. అలా కాకుండా కనీసం పరిస్థితి జఠిలంగా మారితే పేస్తో యూకీ బాంబ్రీ (306వ ర్యాంక్), విష్ణువర్ధన్ (207)లలో ఒకరు వెళ్లాల్సి ఉంటుంది.
టెన్నిస్ జట్టు ఎంపికలో తాము తలదూర్చబోవడం లేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ తేల్చి చెప్పారు. తుది నిర్ణయం ఏఐటీఏ మాత్రమే తీసుకుంటుందని అన్నారు. దీంతో జోక్యం చేసుకోవాలని కోరిన భూపతి ఆశలకు గండిపడినట్టయ్యింది. 'జట్టు ఎంపికలో పాత్ర వహించాలనే ఉద్దేశం క్రీడా శాఖకు లేదు. ప్రముఖ ఆటగాళ్లైన భూపతి, బోపన్న కొన్ని అంశాలను లేవనెత్తుతూ మాకు లేఖ రాశారు. అందుకే విషయం తెలుసుకుందామని టె న్నిస్ సమాఖ్యకు వివరణ అడిగాం. జాతి ప్రయోజనాలను బట్టి ఎవరిని పంపాలో వారే తేల్చుకుంటే మంచిది' అని మాకెన్ తెలిపారు.
తెలుగు వన్ఇండియా