లండన్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల మార్చ్ పాస్ట్లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో పాటుగా కలిసి నడిచిన ఒక అపరిచిత మహిళ వ్యవహారం కలకలం సృష్టించింది. భారత పతాకాన్ని చేతబట్టి ముందుండి నడిచిన బాక్సర్ సుశీల్ కుమార్ పక్కన ఎరుపురంగు టీ షర్ట్, నీలం రంగు ప్యాంటుతో ప్రత్యక్షమైన ఆ మహిళ.. ట్రాక్ మొత్తం ఆటగాళ్లతోనే కలిసి నడిచింది.

ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్న భారత అధికారులు ఆ అపరిచి త మహిళ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 'అసలామె ఎవరో కూడా తెలియదు. ఎవరు అనుమతించారో అంతకన్నా తెలియదు. అది చాలా అవమానకరమైన సంఘటన' అని భారత తాత్కాలిక చెఫ్ డి మిషన్ మురళీధరన్ రాజా అన్నారు. భారత ఆటగాళ్ల మార్చ్ పాస్ట్ను 10 సెకెన్లు పాటు టీవీలో ప్రసారం చేస్తే.. అథ్లెట్ల కన్నా అపరిచిత మహిళపైనే ఎక్కువ దృష్టి పెట్టారంటూ రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు.
అమె ట్రాక్ వరకే కంటింజెంట్ వెంట ఉంటుందని తమకు మొదట చెప్పారని, అయితే మార్చ్లో పూర్తిగా ఆమె ఉందని, మరో వ్యక్తి కూడా తమ వెంట వచ్చాడని, అయితే అతను మైదానంలోకి అడుగు పెట్టలేదని, వెనక్కి వెళ్లిపోయాడని రాజా చెప్పారు.
మార్చ్ అథ్లెట్లకు, కంటింజెంట్తో సంబంధం ఉన్న అధికారులకు సంబంధించింది మాత్రమేనని, ట్రాక్లోకి ఓ వ్యక్తి ఎలా చొరబడుతారనేది తమకు ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన అన్నారు. ఈ సంఘటన తమకు విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.