కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) పాలకమండలిని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. నిబంధనలు ఉల్లఘించినందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సహా కొందరు వ్యతిరేకించారు.
సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచనల ప్రకటన చేసింది. మరోవైపు సాక్షి మాలిక్కు మద్దతు ఇస్తూ బజరంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. అలాగే డెఫ్లింపిక్స్ విజేత వీరేందర్ సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించాడు. ఈ నిరసనల సెగ మధ్య నిబంధనలు అతిక్రమించారనే కారణంతో కొత్తగా ఎన్నికైన ప్యానెల్ను సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అండర్-15, అండర్-20 జాతీయ రెజ్లింగ్ పోటీలను ఈ ఏడాది చివరినాటికి ఉత్తరప్రదేశ్లోని నందినీ నగర్, గోండాలో నిర్వహిస్తామని సంజయ్ సింగ్ ప్రకటించారు.అయితే ఈ ప్రకటన డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, పోటీలకు సిద్ధమయ్యేందుకు రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా ప్రకటించారని క్రీడా మంత్రిత్వ శాఖ మండిపడింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే పోటీలను నిర్వహించాలని తెలిపింది. WFI రాజ్యాంగంలోని ఆర్టికల్ XI ప్రకారం రెజర్లు సిద్ధం కావడానికి కనీసం 15 రోజుల నోటీసు అవసరమని పేర్కొంది.
మరోవైపు సస్పెండ్పై కొత్త ప్యానెల్ చట్టపరమైన పోరాటం చేయాలని భావిస్తుంది. కాగా, క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు రెజ్లర్లు, క్రీడాకారులు స్వాగతిస్తున్నారు. ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా, గీతా ఫొగట్తో పాటు బాక్సర్ విజేందర్ సింగ్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.