హైదరాబాద్: ద్రోణాచార్య అవార్డుల జాబితా నుంచి పారా అథ్లెట్ కోచ్ సత్యనారాయణ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. గతేడాది రియో ఒలింపిక్స్లో బంగారు పతకం గెలిచిన పారా అథ్లెట్ మరియప్ప తంగవేలుకి శిక్షణ ఇచ్చిన కోచ్ సత్యనారాయణ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకి నామినేట్ అయ్యారు.
అయితే అతనిపై ఒక క్రిమినల్ కేసు పెండింగ్లో ఉండటంతో ప్రస్తుతం సత్యనారాయణ పేరుని ఆ జాబితా నుంచి తొలగిస్తున్నామని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ అన్నారు. ద్రోణాచార్య అవార్డు కోసం సత్యనారాయణ పేరు నామినేట్ చేసినప్పటి నుంచి చాలా మంది అతడి నామినేషన్పై బహిరంగంగా పెదవి విరిచారు.
'అవును. సత్యనారాయణ పేరుని జాబితా నుంచి తొలగించాం. అతనిపై ఒక క్రిమినల్ కేసు ఉంది. మిగిలిన వారందరి పేర్లు అలానే ఉన్నాయి. అవార్డులు గెలుచుకున్న వాళ్లకు మెయిల్ ద్వారా సమాచారం అందించాం' అని మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు.
మరోవైపు ఈ జాబితాలోకి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, వెయిట్ లిఫ్టర్ సంజిత చానుల పేర్లు చేర్చాలన్న వార్తలపై ఆయన స్పందించలేదు. క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ అవార్డుల కోసం 17 మంది క్రీడాకారులతో ఒక జాబితాని సిద్ధం చేసి ఇటీవలే క్రీడల మంత్రికి అందజేసింది.
వీరిలో ఇద్దరు పారా అథ్లెట్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో అర్జున అవార్డు రేసులో తంగవేలు కూడా ఉన్నాడు. ద్రోణాచార్య అవార్డుల జాబితా నుంచి తన పేరు తొలగించడం అన్యాయమని కోచ్ సత్యనారాయణ ఆవేదన చెందాడు. 'ద్రోణాచార్య జాబితా నుంచి నా పేరు తొలగించడం అన్యాయం. గిట్టని వాళ్లు ఇలా తప్పుడు ఆరోపణలు చేశారు. నా పేరు తీసేయడం బాధ కలిగిస్తోంది' అని అన్నాడు.