న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో భారత మారథాన్ రన్నర్, మహిళా అథ్లెట్ ఓపీ జైషా అస్వస్థతకు ఆమె కోచ్ నికోలాయ్ స్నెసరెవ్ కారణమని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ విచారణలో తేల్చింది. రియో ఒలింపిక్స్లో మహిళల లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఓపీ జైషాకు నీళ్లు సమకూర్చలేదన్న ఫిర్యాదుపై క్రీడాశాఖ విచారణ కమిటీ దర్యాప్తును పూర్తి చేసింది.
ఈ ఉదంతంలో ఆమె కోచ్ ఇచ్చిన తప్పుడు మార్గదర్శకత్వమే కారణమని విచారణ కమిటీ తేల్చింది. పోటీకి ముందు రోజు అథ్లెట్లకు సంబంధించిన సదుపాయాలన్నీ సమకూర్చాల్సిందిగా రేసుకు ముందు భారత అధికారులు నికోలాయ్కు చెప్పారనీ, అయినా అతడు రేసు సందర్భంగా జైషాకు డ్రింక్స్ ఇచ్చేందుకు నిరాకరించాడని క్రీడాశాఖకు అందజేసిన రెండుపేజీల నివేదికలో కమిటీ పేర్కొంది.
ఈ కారణంగానే ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రతినిధులు మంచినీరు, శక్తి పానీయాలను జైషాకు అందుబాటులో ఉంచలేకపోయారు. లాంగ్ డిస్టెన్స్ పరుగు పందెం కావడంతో పోటీని పూర్తి చేసే క్రమంలో కనీసం మంచినీరైన తాగకపోవడంతో డీహైడ్రేషన్కు గురై తీవ్ర అస్వస్థతతో ఫినిషింగ్ లైన్పై కుప్పకూలింది.

దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరిలించి చికిత్స అందించారు. రేసు మధ్యలో తనకు అధికారులు నీళ్లు అందివ్వకపోవడంపై రియో నుంచి వచ్చిన వెంటనే జైషా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే జైషా ఆరోపణలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఖండించింది.
రేసుకు ముందురోజే ఆమెను కలిసి నీటి ఏర్పాట్లు చేస్తామని చెప్పగా ఆమె తిరస్కరించిందని తెలిపారు. ఐఓఏపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. వాస్తవాలు తెలుసుకునేందుకు క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ కేడియా, డెరైక్టర్ వివేక్ నారాయణ్లతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది.