అథ్లెట్లకు పెరిగిన నిధులు
2018లో జరగనున్న కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకు పెరిగిన నిధులు ఉపయోగపడనున్నాయి. రియోలో నిరాశజనక ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని ఈసారి అథ్లెట్ల సన్నాహాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ ఏడాది రూ. 481 కోట్లు కేటాయించింది.
గతేడాది రూ. 416 కోట్లు మాత్రమే
గతేడాది రూ. 416 కోట్లు మాత్రమే అందజేశారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు సాయం కింద ఇచ్చే నిధులను రూ. 185 కోట్ల నుంచి రూ. 302 కోట్లకు పెంచారు. ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించిన పథకాన్ని ఈసారి సవరించారు. గతేడాది రూ. 131.33 కోట్లు కేటాయించిన ఈ స్కీమ్కు ఈసారి రూ. 148.4 కోట్లకు పెంచారు.
జమ్మూ కాశ్మీర్ కేటాయింపుల్లో మార్పులేదు
ఇక జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన కేటాయింపుల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. గతేడాది మాదిరి ఈసారి కూడా రూ. 75 కోట్లే కేటాయించారు. జాతీయ సేవా పథకానికి సంబంధించిన నిధులను స్వల్పంగా పెంచుతూ రూ. 144 కోట్లు కేటాయించారు. గతేడాది ఇది రూ. 137.50 కోట్లుగా ఉంది. జాతీయ క్రీడాభివృద్ధి నిధికి ఈసారి నిధులు తగ్గించారు.
రూ. 140 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు పెంపు
గతంలో ఉన్న రూ. 5 కోట్ల స్థానంలో రూ. 2 కోట్లు మాత్రమే కేటాయించారు. దేశంలో క్రీడా నైపుణ్యం ఉన్న కుర్రాళ్లను గుర్తించేందుకు ఈసారి రూ.50లక్షల కేటాయించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా కార్యక్రమానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. గతేడాది రూ. 140 కోట్లుగా ఉన్న ఈ బడ్జెట్ను ఈసారి రూ. 350 కోట్లకు పెంచారు.