ఢిల్లీ: జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగుని కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసి ట్రాక్పై సరికొత్త వరల్డ్ రికార్డ్లు నెలకొల్పాడు. బోల్ట్ కంటే వేగంగా కర్ణాటకకి చెందిన శ్రీనివాస గౌడ పరుగెత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 100మీ పరుగుని 9.55 సెకన్లలో అందులోనూ బురద నీటిలో పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. శ్రీనివాస గౌడని ఇప్పుడు అందరూ 'భారత్ ఉసేన్ బోల్ట్' అని పిలుస్తున్నారు.
షాహిద్ అఫ్రిదికి ఐదో సంతానం.. ఈసారి కూడా కుమార్తెనే (ఫొటో)!!
శ్రీనివాస గౌడ 100మీ పరుగుని 9.55 సెకన్లలో పూర్తిచేయడంతో సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ విషయం ఇప్పుడు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు చేరింది. శ్రీనివాస గౌడకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి ఆహ్వానం పంపుతామని మంత్రి రిజిజు స్పష్టం చేశారు. తానే స్వయంగా గౌడకు కాల్ చేసి సాయ్ నిర్వహించే ట్రయల్కు రమ్మని పిలుస్తానని హామీ ఇచ్చారు.
'శ్రీనివాస గౌడ ప్రదర్శన అద్భుతం. కోచ్ల ద్వారా గౌడను సాయ్ ట్రయల్స్కు రమ్మని పిలుస్తా. చాలామందికి ఒలింపిక్స్ స్టాండర్స్ గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ప్రత్యేకంగా అథ్లెటిక్స్లో శరీర ధృడత్వం కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ధృడత్వంతో పాటు ఓర్పు కూడా అవసరం. దాంతోనే ఎన్నో ఘనతలు సాధించవచ్చు. భారత్లో టాలెంట్ నిరూపయోగంగా ఉండకూడదు' అని కిరణ్ రిజుజు అన్నారు.
సోషల్ మీడియాలో ఉసేన్ బోల్ట్తో పోలికలు వస్తుండడంతో శ్రీనివాస గౌడ స్పందించారు. 'దేశంలోని ప్రజలు నన్ను ఉసేన్ బోల్ట్తో పోలుస్తున్నారు. అతను ఓ ప్రపంచ ఛాంపియన్. నేను కేవలం బురద పొలంలో మాత్రమే పరుగెత్తుతాను' అని కంబాల జాకీ తెలిపారు.
దక్షిణ కన్నడకు చెందిన సాంప్రదాయ కంబాల పోటీదారు 28 ఏళ్ల శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే పూర్తి చేశారు. అంటే.. గౌడ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే అందుకున్నారు. అది కూడా గేదెలతో బురద నీటిలో పరుగెత్తడం విశేషం. 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తడం అంటే.. ప్రపంచ ఛాంపియన్ బోల్ట్ అత్యుత్తమ ప్రదర్శన కంటే గొప్పది.