హైదరాబాద్: ఒలింపిక్స్లో ఆడే విషయంలో ఐటా ముందుగానే టెన్నిస్ క్రీడాకారులతో మాట్లాడి ఉండాల్సిందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా అభిప్రాయపడింది. ముందుగానే సానియా మీర్జాతో మాట్లాడి ఉంటే గొడవ అయి ఉండేది కాదని ఆమె అన్నారు. లండన్ ఒలింపిక్స్ అధికారిక స్పాన్సర్ ఒమేగా సంస్థ నగరంలో నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మిక్స్డ్ డబుల్స్ జట్టును ఖరారు చేసే ముందు సానియాతో మాట్లాడి ఉండాల్సిందని ఆమె అన్నారు. ఒలింపిక్స్కు తాము పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నామని ఆమె అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తర్వాత గోపిచంద్ అకాడమీలోనూ శిక్షణ పొందుతానని ఆమె చెప్పారు.
క్రీడల్లో పురుషాధిక్యం కొనసాగుతోందని ఆమె విమర్శించారు. తాము ప్రోత్సాహక బహుమతులకు పనికి రామా అని ఆమె అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆమె అన్నారు. ప్రపంచ కప్ గెలవడం కన్నా ఇంకేం కావాలని ఆమె అడిగారు. సానియా మీర్జాకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని ఆమె తెలిపారు.
టెన్నిస్ జట్టు ఎంపిక విషయంలో సానియా చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆమె అన్నారు. వుమెన్ డబుల్స్తో పాటు మిక్స్డ్ డబుల్స్లో జ్వాలా గుత్తా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఫిట్నెస్ తన విషయంలో అత్యంత ప్రధానమైందని, తాను తీవ్రంగా శ్రమిస్తున్నానని గుత్తా జ్వాలా చెప్పారు. తాను అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉంటానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉదయమూ సాయంత్రమూ, కోర్టు వెలుపల కూడా బ్యాడ్మింటన్ గురించే ఆలోచిస్తే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని ఆమె అన్నారు.
అంత పెద్ద ఈవెంట్ ఉన్న సమయంలో కాస్తా రిలాక్స్గా ఉండి, ఎంజాయ్ చేయాలని, అట్లని శ్రమించకూడదని తన ఉద్దేశ కాదని, తీవ్రంగా శ్రమిస్తూ రిలాక్స్ కావాలని ఆమె అన్నారు. రెండు ముఖ్యమేనని ఆమె అన్నారు. గగన్ నారంగ్ ఒలింపిక్స్లో పతకం సాధిస్తాడని ఆమె అన్నారు. మహేష్ భూపతి, లియాండర్ పేస్ వివాదంపై మాట్లాడడానికి ఆమె నిరాకరించారు. అది వారి వ్యక్తిగత విషయమని, తాను మాట్లాడదలుచుకోలేదని, వారు సమస్యను పరిష్కరించుకుంటే దేశానికి మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.