
వేలంలో ఢిల్లీ వేవర్ రైడర్స్, ముంబయి మెజీషియన్స్, పంజాబ్ వారియర్స్, ఉత్తర్ ప్రదేశ్ విజార్డ్స్, రాంచీ రైనోస్, బెంగళూరు పాల్గొన్నాయి. ఈ లీగ్ జనవరి 17న ప్రారంభం కానుంది. వేలంలో మొదటి స్థానంలో నిలిచిన సర్దార్ సింగ్ను ఢిల్లీ ఫ్రాంచైజీ 42.49 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. రఘునాథ్ను నాటకీయ పరిణామాల మధ్య సహారా ఉత్తరప్రదేశ్ జట్టు 41.40 లక్షలకు సొంతం చేసుకుంది.
రఘునాథ్ కోసం ఢిల్లీ, యుపి జట్లు చివరిదాకా పోటీపడ్డాయి. అతని ప్రాథమిక ధర 7.56 లక్షలు కావడం గమనార్హం. సందీప్ ప్రాథమిక ధర 15.13 లక్షల మొత్తానికే ముంబయి దక్కించుకుంది. ఆస్ట్రేలియా డిఫెండర్ జో కరోల్ను 30.39 లక్షలకు కొనుగోలు చేసిన ముంబయి.. సందీప్ను చౌకధరకు దక్కించుకుంది. ఈ పరిణామాన్ని సందీప్ జీర్ణించుకోలేకపోయాడు. అత్యధిక ధరకు అమ్ముడయిన సర్దార్ సంతోషం వ్యక్తం చేశాడు.
యువ డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ (ప్రాథమిక ధర 5.03 లక్షలు) ఊహించని ధర పలికాడు. రూపిందర్కు ఢిల్లీ 30.48 లక్షలు చెల్లించింది. ఇక వేలంలో అమ్ముడుబోని ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ భరత్ ఛెత్రి ఉన్నాడు. లండన్ ఒలింపిక్స్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టుకు ఛెత్రి సారథ్యం వహించాడు.
విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధరలు పలికిన ఆటగాళ్లలో జర్మనీ కెప్టెన్ మోరిస్ ఫురెట్జ్ (రాంచీ, 41.10 లక్షలు), ఇంగ్లండ్ ఆటగాడు ఆష్లే జాక్సన్ (రాంచీ, 39.62 లక్షలు), నెదర్లాండ్స్ కెప్టెన్ టిన్ డి నూజెర్ (యూపీ, 35.93 లక్షలు), ఆసీస్ లెజెండ్ జేమీ డ్వేర్ (పంజాబ్, 32.66 లక్షలు), ఆసీస్ డిఫెండర్ జో కరోల్ (ముంబయి, 30.39 లక్షలు) ఉన్నారు.
ఆసీస్ ఆటగాడు సిమోన్ ఆర్చర్డ్ (24.50 లక్షలు), పాకిస్థాన్ ఆటగాడు రషీద్ (22.32 లక్షలు) అమ్ముడుపోయారు. భారత జట్టులో అత్యధికమంది ఆటగాళ్లను ఢిల్లీ కొనుగోలు చేసింది. రాంచీ జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నారు. భారత ఆటగాళ్ల ధరలు ఇలా ఉన్నాయి. గుర్వీందర్ సింగ్: 27.24 లక్షలు (ఢిల్లీ); సర్వణ్జిత్ సింగ్: 18 లక్షలు (రాంచీ); సునీల్: 22.86 లక్షలు (ఢిల్లీ); ఇగ్నేస్ టిర్కీ: 16.87 లక్షలు (పంజాబ్); అయ్యప్ప: 11.43 లక్షలు; గుర్బాజ్ సింగ్: 19.60 లక్షలు (రాంచీ); కొతజిత్సింగ్: 17.42 లక్షలు (రాం చీ); అమిత్ రోహిదాస్: 15.78 లక్షలు.