ఖాట్మండు: దక్షిణాసియా క్రీడల్లో భారత్ సత్తాచాటింది. నేపాల్లో మంగళవారం ముగిసిన ఈ క్రీడల్లో రికార్డు స్థాయిలో 312 (174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్య) పతకాలతో 13వసారి అగ్రస్థానంలో నిలిచింది. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో అత్యధికంగా 309 పతకాలు సాధించిన భారత్.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. 1984లో దక్షిణాసియా క్రీడలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు జరిగిన అన్ని క్రీడల్లోనూ పతకాల పట్టికలో భారతే అగ్రస్థానంలో నిలవడం విశేషం.
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
పోటీలకు ఆఖరి రోజైన మంగళవారం భారత్ 18 పతకాలు సాధించింది. బాక్సింగ్లోనే 12 స్వర్ణాలు రావడం విశేషం. మంగళవారం భారత్ 15 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు సాధించింది. బాస్కెట్బాల్ ఫైనల్స్లో భారత పురుషుల జట్టు 101-62తో శ్రీలంక జట్టుపై.. భారత మహిళల జట్టు 127-46తో నేపాల్పై గెలిచి స్వర్ణ పతకాలు సాధించాయి.
స్క్వాష్ టీమ్ ఈవెంట్స్లో భారత మహిళల జట్టు స్వర్ణం, పురుషుల జట్టు రజతం కైవసం చేసుకున్నాయి. ఇక బాక్సింగ్లో ఆరు పసిడి పతకాలు లభించాయి. పురుషుల విభాగంలో వికాస్ కృషన్ (69 కేజీలు), స్పర్శ్ కుమార్ (52 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు).. మహిళల విభాగంలో పింకీ రాణి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), మంజు బొంబారియా (64 కేజీలు) విజేతలుగా నిలిచారు.
దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 312 పతకాలు సాధించి టాప్లో నిలిచింది. ఆతిథ్య నేపాల్ 206 (51 స్వర్ణ, 60 రజత, 95 కాంస్య) పతకాలతో రెండో స్థానంలో, శ్రీలంక 251 (40 స్వర్ణ, 83 రజత, 128 కాంస్య) పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.