ఖట్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల వాలీబాల్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు భారత మహిళల వాలీబాల్ జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో భారత్ 27-25, 25-19, 21-25, 25-21తో శ్రీలంకపై విజయం సాధించింది. మరో సెమీస్లో పాకిస్తాన్ 25-15, 25-21, 26-24తో బంగ్లాదేశ్ను ఓడించడంతో.. భారత్-పాక్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
మనీశ్ పాండే మెరుపులు.. ముస్తాక్ అలీ ట్రోఫీ కర్ణాటకదే!!
మహిళల విభాగంలోనూ డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్ తుది పోరులో నేపాల్తో తలపడుతుంది. మహిళల సెమీఫైనల్లో భారత్ 25-14, 25-6, 25-17తో మాల్దీవులుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో శ్రీలంకపై నేపాల్ నెగ్గింది. ఈ రెండు ఫైనల్ మ్యాచ్లు మంగళవారం జరుగుతాయి.
పలు క్రీడాంశాల్లో పోటీలు మొదలైనప్పటికీ.. ప్రారంభ వేడుకలు వేడుకలు మాత్రం ఆదివారం లాంఛనంగా జరిగాయి. దశరథ స్టేడియంలో నేపాల్ దేశ రాష్ట్రపతి బిద్యాదేవి భండారి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. నేపాలీ సంప్రదాయ శైలీలో అట్టహాసంగా వేడుకల్ని నిర్వహించారు. ప్రారంభ వేడుకలు అందరినీ అలరించాయి. మొత్తం 15వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం మొత్తం పూర్తిగా నిండిపోయింది.
మొదటగా టోర్నీలో పాల్గొంటున్న ఏడు దేశాల అథ్లెట్లు మార్చ్పాస్ట్ నిర్వహించగా.. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ సందడిగా మారింది. డిసెంబర్ 10న ముగియనున్న ఈ టోర్నీలో మొత్తం 26 క్రీడాంశాలకు గాను దాదాపు 2700 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.