ఖట్మాండు: దక్షిణాసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. రెండో రోజు భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. తొలిరోజు 16 పతకాలు చేజిక్కించుకున్న భారత క్రీడాకారులు రెండోరోజు మరో 27 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. అందులో 11 స్వర్ణాలు ఉన్నాయి. ముఖ్యంగా షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్లో మనవాళ్ల జోరుకు ఎదురు లేకుండాపోయింది.
నాసాకు ఆర్సీబీ రిక్వెస్ట్.. డివిలియర్స్, కోహ్లీ సిక్సర్లను కూడా కనిపెట్టండి!!
టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్స్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గాయి. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న భారత టీటీ మహిళల జట్టు ఫైనల్లో 3-0తో శ్రీలంకను ఓడించింది. ఫైనల్స్ మ్యాచ్ల్లో సుతీర్థ ముఖర్జీ 11-9, 11-7, 11-3తో ఇషారా మధురాంగిపై, కృత్విక సిన్హా రాయ్ 11-6, 11-4, 11-2తో ఇరాండి వరుస్వితానాపై, ఆకుల శ్రీజ 11-5, 11-5, 11-3తో హన్సిని పియుమిలాపై గెలిచారు. ఆంథోని అమల్రాజ్, హర్మీత్ దేశాయ్, సౌమ్యజిత్ ఘోష్ సభ్యులుగా ఉన్న భారత పురుషుల టీటీ జట్టు ఫైనల్లో 3-0తో నేపాల్పై గెలిచింది.
వాలీబాల్ ఈవెంట్లో రెండు స్వర్ణాలు దక్కాయి. ఫైనల్స్లో భారత పురుషుల జట్టు 20-25, 25-15, 25-17, 29-27తో పాకిస్తాన్పై నెగ్గగా.. భారత మహిళల జట్టు 25-17, 23-25, 21-25, 25-20, 15-6తో నేపాల్ను ఓడించింది. షూటింగ్లో భారత్కు 4 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్.. టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాలు గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చెయిన్ సింగ్.. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో యోగేశ్ సింగ్ స్వర్ణాలు సాధించారు.
తైక్వాండోలో ఓ స్వర్ణం, 3 కాంస్యాలు దక్కాయి. మహిళల 57 కేజీల విభాగంలో కశిష్ మలిక్ పసిడి పతకం నెగ్గింది. అథ్లెటిక్స్లో భారత్కు బంగారు పతకాలు దక్కాయి. ఖో-ఖోలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. ప్రస్తుతం భారత్ 43 పతకాల (18 స్వర్ణాలు, 16 రజతాలు, 9 కాంస్యాలు)తో రెండో స్థానంలో ఉండగా.. నేపాల్ 44 (23 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు) టాప్లో కొనసాగుతున్నది.