ఖాట్మండు: దక్షిణాసియా క్రీడల పతకాల వేటలో భారత్ జోరు కొనసాగుతోంది. ఆరో రోజైన శనివారం భారత ప్లేయర్లు 29 స్వర్ణాలు సహా మొత్తం 49 పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 214కు చేరింది. ఇందులో 110 స్వర్ణాలు, 69 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి. ఈ క్రీడల చరిత్రలో భారత్ ఆరోసారి స్వర్ణ పతకాల సెంచరీని పూర్తి చేసుకుంది. ఇక 214 పతకాలతో టాప్లో కొనసాగుతోంది.
డోప్ టెస్టులో సత్నామ్ విఫలం.. తాత్కాలికంగా సస్పెన్షన్!!
శనివారం స్విమ్మర్లు, రెజ్లర్లు, షూటర్ల అదరగొట్టడంతో భారత పసిడి పతకాల సంఖ్య 100 దాటింది. స్విమ్మింగ్లో శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్స్ట్రోక్), రిచా మిశ్రా (800 మీ. ఫ్రీస్టయిల్), శివ (400 మీ. వ్యక్తిగత మెడ్లే), మానా పటేల్ (100 మీ. బ్యాక్స్ట్రోక్), చాహాత్ అరోరా (50 మీ. బ్యాక్స్ట్రోక్), లిఖిత్ (50 మీ. బ్రెస్ట్స్ట్రోక్), రుజుతా భట్ (50 మీ. ఫ్రీస్టయిల్) స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.
రెజ్లింగ్లో సత్యవర్త్ కడియాన్ (పురుషుల ఫ్రీస్టయిల్ 97 కేజీలు), సుమీత్ మలిక్ (పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీలు), గుర్శరణ్ప్రీత్ కౌర్ (మహిళల 76 కేజీలు), సరితా మోర్ (మహిళల 57 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. షూటింగ్లో మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అనీశ్ భన్వాలా.. టీమ్ విభాగంలో అనీశ్, భావేశ్, ఆదర్శ్ సింగ్లతో కూడిన భారత జట్టుకు.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో మెహులీ ఘోష్-యశ్ వర్ధన్ జంటకు స్వర్ణాలు దక్కాయి.
వెయిట్లిఫ్టింగ్లో మహిళల 81 కేజీల విభాగంలో సృష్టి సింగ్.. 87 కేజీల విభాగంలో అనురాధ బంగారు పతకాలు సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ భారత అథ్లెట్లు 8 పతకాలు అందించారు. స్క్వాష్లో హరేందర్ పాల్, సునయన, తన్వి ఫైనల్కు చేరుకున్నారు. ఫుట్బాల్లో భారత్ 1-0తో నేపాల్ను ఓడించి తుది పోరుకు చేరుకుంది. పతకాల పట్టికలో భారత్ (214) అగ్రస్థానంలో కొనసాగుతుంటే.. ఆతిథ్య నేపాల్ (142), శ్రీలంక (170) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.