న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ యువ కెరటం, మన తెలుగు కుర్రాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ బాలుర సింగిల్స్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్లో అతడు ఏకంగా పదకొండు స్థానాలు మెరుగపడి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.
రెండు నెలల క్రితం ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో పదహారేళ్ల సిరిల్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆటగాడు అతనొక్కడే. 2013లో ఆసియా యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, 2014లో ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్యం కూడా అతడు సాధించాడు.
మరోవైపు మహిళల సింగిల్స్లో కరోలినా మారిన్ (స్పెయిన్), సైనా నెహ్వాల్ వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పీవీ సింధు 12వ స్థానంలో ఉంది. పురుషుల సింగిల్స్లో భారత్ తరఫున శ్రీకాంత్ (9) ఒక్కడే టాప్-10లో నిలిచాడు.

కశ్యప్ 15వ, ప్రణయ్ 20వ, అజయ్ జయరాం 21వ స్థానాల్లో ఉన్నారు. మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 14వ ర్యాంకులో.. పురుషుల డబుల్స్లో సుమీత్రెడ్డి-మను అత్రి 17వ ర్యాంకులో నిలిచారు.
అపూర్వీకి మరో స్వర్ణం
స్వీడన్లోని సావ్జోలో జరుగుతున్న స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రీలో భారత ఏస్ షూటర్ అపూర్వీ చండీలా వరుసగా రెండో రోజు రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, మహిళల 10 మీటర్ల ట్రై-సిరీస్ ఈవెంట్లో 23 ఏళ్ల అపూర్వీ 208.9 పాయింట్లు సంపాదించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.
అంతకు ముందు ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 211.2 పాయింట్లతో విజేతగా నిలవడమేగాక, చైనా షూటర్ ఇ సిలింగ్ 211 పాయింట్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్ను కొనసాగిస్తూ ట్రై-సిరీస్లోనూ ఆమె స్వర్ణ పతకాన్ని అందుకుంది.