
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. దీనితో వరల్డ్కప్లో పాక్తో భారత్ ఆడబోయే మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం వరల్డ్కప్లో పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితిలోనూ క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసింది. తాజాగా న్యూఢిల్లీ వేదికగా భారత్ ఆతిథ్యమివ్వనున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో పాల్గొనాల్సిన పాకిస్థాన్ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు నిరాకరించింది.
దీంతో దీనిపై పాకిస్థాన్ షూటింగ్ సమాఖ్య స్పందించింది. ఈ వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్ బెర్తులు నిర్ణయం కానుండటంతో పాక్ షూటర్లు పాల్గొనాల్సిన 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ ఈవెంట్లను ఈ వరల్డ్ కప్లో రద్దు చేయాలని ప్రపంచ షూటింగ్ సమాఖ్యను పాక్ కోరింది. అంతేకాదు ఈవెంట్లను మరో దేశంలో నిర్వహించాలని పాక్ కోరింది.
మరోవైపు, ఈ విషయంపై పాకిస్థాన్ జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఎస్ఆర్ఎఫ్) అధ్యక్షుడు రజీ అహ్మద్ మాట్లాడుతూ "బుధవారం ఉదయం మేం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. గురువారం చాంపియన్షిప్ మొదలవుతుంది. కానీ పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మాకు వీసాలు ఇవ్వలేదు. కాబట్టి మేం పర్యటనను రద్దు చేసుకున్నాం" అని చెప్పారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో వీసాలు రావడం చాలా కష్టతరంగా మారింది. ఒలింపిక్స్కు అర్హత సాధించే గొప్ప అవకాశం మా షూటర్లకు దక్కలేదు. ఇది చాలా నిరాశ కలిగించే అంశం" అని ఆయన అన్నారు. ర్యాపిడ్ ఫైర్ విభాగంలో పాక్ తరఫున జీఎమ్ బషీర్, ఖలీల్ అహ్మద్ బరిలోకి దిగాల్సి ఉంది.