హైదరాబాద్: మెక్సికోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లో తొలిరోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అరంగేట్ర ప్రపంచకప్లోనే షాజర్ రిజ్వీ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా.. జీతూ రాయ్, మెహులీ ఘోష్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. మీరట్కు చెందిన రిజ్వీ ఫైనల్లో మొత్తం 242.3 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 241.8 పాయింట్లతో తొమొయుకి మత్సుదా (జపాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రిజ్వీ బద్దలు కొట్టాడు.
భారత్కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 219 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకోగా... ఒలింపిక్ చాంపియన్ క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ) 239.7 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఓం ప్రకాష్ 198.4 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచాడు.
33 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్లో క్రిస్టియన్ రీట్జ్ (588 పాయింట్లు) తొలి స్థానంలో నిలువగా... రిజ్వీ (579 పాయింట్లు), జీతూ రాయ్ (578 పాయింట్లు), ఓంప్రకాశ్ (576 పాయింట్లు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు.
ఇక, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్ నుంచి ముగ్గురు షూటర్లు మెహులీ ఘోష్, అపూర్వీ చండేలా, అంజుమ్ మౌద్గిల్ ఫైనల్కు చేరారు. సీనియర్ విభాగంలో తొలిసారి పోటీపడిన మెహులీ ఘోష్ పతకాన్ని సొంతం చేసుకుంది. 228.4 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంంది.
దీంతో ఆమె జూనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. లారా జార్జెటా(రుమేనియా, 251.5 పాయింట్లు) స్వర్ణం, హాంగ్ జు (చైనా, 251 పాయింట్లు) రజతం కైవసం చేసుకున్నారు. అంజుమ్ మౌడ్గిల్ 208.6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. అపూర్వి 144.1 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది.
గతేడాది జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో మెహులీ ఘోష్ ఏకంగా 8 స్వర్ణ పతకాలు సాధించి వెలుగులోకి వచ్చింది. పోటీల తొలి రోజు భారత షూటర్ల అద్భుత ప్రదర్శనపై భారత జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రనింధర్ సింగ్ మాట్లాడుతూ 'యువ షూటర్లు మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఇది అద్భుత ప్రదర్శన. రిజ్వీ తొలి ప్రపంచకప్లోనే స్వర్ణం గెలవడంతో పాటు ప్రపంచ రికార్డు సృష్టించాడు. మెహులీ కూడా' అని అన్నాడు.