
హైదరాబాద్: మెక్సికో వేదికగా జరుగుతోన్న ఐఎస్ఎస్ఎఫ్ సీనియర్ షూటింగ్ వరల్డ్కప్ పోటీల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తాజాగా మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. ఈ టోర్నీలో యువ షూటర్ మను భకర్ సంచలనాలు సృష్టిస్తోంది.
సీనియర్ విభాగంలో తొలి ప్రపంచకప్ ఆడుతున్న 16 ఏళ్ల మను సోమవారం జరిగిన మిక్సిడ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 16 ఏళ్ల మను భకర్.. ఓమ్ ప్రకాశ్ మిథర్వాల్తో కలిసి స్వర్ణం సాధించింది.
మరోవైపు భారత్కు చెందిన మహిమ తుర్తీ అగర్వాల్-షెహజర్ రిజ్వీల జోడీ 372.4 పాయింట్లతో నాలుగో స్ధానంలో నిలిచింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో మెహలీ ఘోష్-దీపక్ కుమార్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. 435.1 పాయింట్లతో మెహలీ ఘోష్-దీపక్ కుమార్ జోడీ మూడో స్ధానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ టోర్నీలో మను భకర్కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హర్యానాకు చెందిన మను భకర్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన మరుసటి రోజే మరో పతకం సాధించి ఔరా అనిపించింది. రెండుసార్లు వరల్డ్కప్ ఫైనల్ విజేత, ఆతిథ్య దేశానికి చెందిన అలెజంద్ర జవాలను వెనక్కి నెట్టి మను భకర్ స్వర్ణం సాధించడం విశేషం.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను 237.5 పాయింట్లతో స్వర్ణం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 237.1 పాయింట్లతో జవాలా రెండో స్థానంలో నిలవగా... ఫ్రాన్స్కు చెందిన సీలైన్ గోబర్విల్లే (217 పాయింట్ల)తో మూడో స్ధానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 7 పతకాలు కొల్లగొట్టి పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.